Vizag Fishing Harbour Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంపై పవన్ రియాక్షన్
ఫిషింగ్ హార్బర్లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు
- Author : Sudheer
Date : 20-11-2023 - 11:08 IST
Published By : Hashtagu Telugu Desk
ఆదివారం అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్ (Vizag Fishing Harbour)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident)చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు వందకు పైగా మరబోట్లు (Boats) కాళీ బూడిదయ్యాయి. మొదట ఒక బోట్లో చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల కిందట సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికిచేరాయి.
లక్షల రూపాయలు విలువ చేసే మత్స్య సంపద ఆ బోట్లలోనే ఉంది. సోమవారం ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు 5 నుంచి 6 లక్షల విలువైన చేపలున్నాయని బాధిత మత్స్యకారులు చెబుతున్నారు . అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. అందుబాటులో ఉన్న ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. మత్సకారుల్లో కొంతమంది ధైర్యంగా వారి బోట్లను సముద్రంలోకి తీసుకుపోవడంతో కొంత మేర నష్టం తగ్గింది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 30 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రమాదం ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఫిషింగ్ హార్బర్లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్ల యజమానులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీటిపై ఆధారపడ్డ మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టాలని.. భద్రతాపరమైన అంశాలపై సమీక్షించి, పటిష్ట చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
అలాగే ఈ ఘటనపై సీఎం జగన్ (CM Jagan) సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలానికి వెళ్లాలని మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎం సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఈ ప్రమాదం ఫై పోలీసులు ఓ యూట్యూబర్ ను అనుమానిస్తున్నారు. నిన్న రాత్రి ఇక్కడ బర్త్ డే వేడుకలు జరిపారని..ఆ సమయంలో వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సదరు యూట్యూబర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Read Also : Team India Failure : భారత్ ఓటమి నుంచి నేనేం నేర్చుకున్నానంటే.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్