YS Jagan : ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి..తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్
రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు.
- Author : Latha Suma
Date : 04-07-2025 - 7:09 IST
Published By : Hashtagu Telugu Desk
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, నేటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా సంక్షోభంలోనికి వెళ్లిపోయిందని, రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు ఎటువంటి రక్షణ లేకుండా జీవితాలను గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ లా అండ్ ఆర్డర్ పట్ల ప్రభుత్వం కనీస బాధ్యత తీసుకోవడం లేదు. రెడ్బుక్ లాంటి విధానాలతో, రాజకీయ పగలతో ముదిరిన దుర్మార్గపు చర్యలతో రాష్ట్రం రక్తమోడుతోంది. శాంతిని భంగం చేస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై పథకం ప్రకారం తప్పుడు కేసులు నమోదు చేసి, అరెస్టులు చేస్తుండటం విచారకరం.
Read Also: Ukraine- Russia: ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి.. ఏకంగా 550 దాడులు!
అది సాధ్యం కాకపోతే, ప్రత్యక్ష దాడులకు పాల్పడేందుకు టీడీపీకి చెందిన వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారు అని జగన్ విమర్శించారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావుపై దాడి ఉదాహరణగా చూపుతూ జగన్ పట్టపగలు ఆయనను చితక్కొట్టే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం, ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా పాలన సాగుతుందో స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. రాష్ట్రంలో జరుగుతున్న మాఫియా పాలనకు నిదర్శనం అని తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం వైసీపీలో చురుకుగా పాల్గొంటూ, ప్రజల్లో గౌరవాన్ని సంపాదించిందని, దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే స్వయంగా తన అనుచరులను పురిగొల్పి ఈ దాడులకు తెగబడ్డారు.
ఇది ఒక తాలూకు రాజకీయ కుట్ర. గందరగోళం సృష్టించి ప్రజల మద్దతు కోల్పోతున్న టీడీపీ, ఇప్పుడు భయపడతూ అరాచకాలకు పాల్పడుతోంది అని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ దాడులను ప్రోత్సహిస్తూ, గ్యాంగ్లీడర్లా వ్యవహరిస్తున్నారు. వరుస దాడులు, వేధింపుల నేపథ్యంలో, ఈ రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు. మాఫియా తరహాలో పాలన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేందుకు అర్హత లేదు. చట్టాన్ని అమలు చేయలేని పరిస్థితి నెలకొన్నప్పుడు, రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గం లేదని నేను ప్రశ్నిస్తున్నాను అని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్రం నిద్రలేచి స్పందించాలనీ, రాష్ట్రంలోని ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జగన్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
Read Also: Operation Sindoor : దేశ సార్వభౌమాధికార రక్షణకు ‘ఆపరేషన్ సిందూర్’ నిలువెత్తు ఉదాహరణ : అమిత్ షా