Garikapati : తెలంగాణలో ఉంటూ ఏపీకి సలహాలివ్వొద్దు – గరికపాటికి కమలానంద కౌంటర్
ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలుగుదనం లేదని, అది ఇతర రాష్ట్రాల పేర్లలాగే (ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తరహాలో) ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు తరహాలో మన రాష్ట్రం పేరును కూడా 'తెలుగునాడు'గా మార్చాలని
- Author : Sudheer
Date : 02-03-2026 - 12:56 IST
Published By : Hashtagu Telugu Desk
Garikapati : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్పు అంశంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్నాయి. అమలాపురంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలుగుదనం లేదని, అది ఇతర రాష్ట్రాల పేర్లలాగే (ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తరహాలో) ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు తరహాలో మన రాష్ట్రం పేరును కూడా ‘తెలుగునాడు’గా మార్చాలని, ఇది ఎన్టీఆర్ ఆశయమని ఆయన గుర్తు చేశారు. కేరళ ప్రజలు తమ రాష్ట్రం పేరు మార్పు కోసం చూపుతున్న పట్టుదలను మనం కూడా అలవర్చుకోవాలని, పేరు మారితేనే తెలుగు వారి బతుకులు మారుతాయని గరికపాటి వ్యాఖ్యానించారు. అలాగే ప్రాథమిక విద్య అంతా తెలుగు మీడియంలోనే సాగాలని ఆయన నొక్కి చెప్పారు.
కమలానంద భారతి కౌంటర్ – తెలంగాణలో ఉంటూ సలహాలివ్వొద్దు
గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాల్సిన అవసరం లేదని , రామాయణ కాలం నుంచే ఆంధ్ర అనే పేరు వాడుకలో ఉందని ఆయన వివరణ ఇచ్చారు. గరికపాటి తెలంగాణలో స్థిరపడి, ఎక్కడో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సలహాలు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. “మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలుగానే ఉంటాం” అని స్పష్టం చేస్తూ, అడిగేవారు లేరని ఇలాంటి వింత పోకడలు, వింత ఆలోచనలు చేయడం మేధావుల లక్షణం కాదని కమలానంద భారతి మండిపడ్డారు.
ముదురుతున్న ‘ఆత్మగౌరవ’ వివాదం
ఈ వివాదం కేవలం పేరు మార్పుకే పరిమితం కాకుండా ప్రాంతీయ వాదానికి దారితీస్తోంది. గరికపాటి వంటి వారు గతంలో మద్రాసు మనకు దక్కకుండా చేశారని, ఇప్పుడు తమ ప్రాంతం ఎలా ఉండాలో తమకు తెలుసని కమలానంద భారతి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్నా పార్టీ పేరును ‘తెలుగుదేశం’ అని పెట్టారే తప్ప రాష్ట్రం పేరు మార్చలేదని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి ఒకవైపు భాషా గర్వం పేరుతో గరికపాటి, మరోవైపు చారిత్రక ప్రాధాన్యత పేరుతో కమలానంద భారతి చేసిన వాదనలతో ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు వ్యవహారం ఇప్పుడు రాజకీయ మరియు సాంస్కృతిక వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.