MLC Elections : ఎమ్మెల్సీ బరిలో జనసేన
MLC Elections : కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేనకు అవి వరించనుండగా, జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు సమాచారం
- By Sudheer Published Date - 10:44 AM, Tue - 25 February 25

ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈసారి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా, అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం అవి కూటమి ఖాతాలోకే వెళ్తాయని స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ(YCP)కి తక్కువ సంఖ్యాబలం ఉండటంతో, పోటీ చేయాలన్న ఆలోచన కూడా లేకుండా పోయింది. కూటమిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన(Janasena)కు అవి వరించనుండగా, జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నట్లు సమాచారం.
Maha Shivaratri : వేములవాడ రాజన్న క్షేత్రంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు
కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేనకు ఒక ఎమ్మెల్సీ స్థానం లభించనుండగా, ఆ స్థానం కోసం నాగబాబు (Nagababu) పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే జనసేన నాయకత్వం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేయాలని సంకల్పించడంతో, ఈ నిర్ణయం ముందుగానే ఊహించదగినదే. మరోవైపు, తెలుగుదేశం తరఫున కూడా పలువురు నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశపడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో అవకాశం దక్కే సూచనలు లేవు. కూటమి తరఫున రాజ్యసభ సీట్లు కేటాయించినందున, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇకపోతే వైఎస్సార్సీపీకి వచ్చే ఐదేళ్లలోనైనా ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యత్వం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో స్వల్పసంఖ్యాబలం మాత్రమే పొందడం వల్ల, ఇక ముందు ఏ పదవులూ దక్కే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.