Jagan : విజయవాడ జైలుకు జగన్..ఎందుకంటే..!!
Jagan : ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు చేరుకొని, నేరుగా సబ్ జైలుకు వెళ్లి వంశీని కలవనున్నారు
- Author : Sudheer
Date : 17-02-2025 - 12:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh politics) మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan) పరామర్శించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు చేరుకొని, నేరుగా సబ్ జైలుకు వెళ్లి వంశీని కలవనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వంశీ కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వనున్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనతో వల్లభనేని వంశీ పేరు తెరపైకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనలో వంశీ ప్రధాన పాత్ర పోషించారని నమ్మి ఆయనపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు పంపారు. దాదాపు వారం రోజులుగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న ఆయనకు ప్రత్యేకంగా ఒకటో నంబర్ బ్యారక్ను కేటాయించారు.
జైల్లో వంశీకి కేటాయించిన బ్యారక్కు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. అత్యంత భద్రత కలిగిన ఈ ప్రాంతంలో ఇతర ఖైదీలెవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా, బ్యారక్ చుట్టూ పరదాలు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. ఇక వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆయనకు తాజా అరెస్ట్ తర్వాత మరింత కష్టకాలం ఎదురుకానుందని కొందరు భావిస్తున్నారు. మరోవైపు జగన్ పరామర్శ అతనికి ధైర్యాన్నిస్తుందని, భవిష్యత్తులో పార్టీ తరపున మరింత కీలక పాత్ర పోషించొచ్చని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా, జగన్ ఈ సందర్శన అనంతరం ఏమైనా కీలక ప్రకటన చేస్తారా? వంశీ కేసు గురించి ప్రభుత్వ వైఖరి మారుతుందా? అనే ప్రశ్నలపై అందరి దృష్టి నెలకొంది.