Jagan Key Comments : బాబును పులితో పోల్చిన జగన్
Jagan Key Comments : "బాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే" అంటూ వ్యాఖ్యానించారు. మాఫియాలతో నిండిపోయిన పాలనను ప్రజలు సరిదిద్దాల్సిన అవసరం ఉందని" ఆయన పిలుపునిచ్చారు
- By Sudheer Published Date - 04:03 PM, Thu - 19 December 24

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) చంద్రబాబు(Chandrababu)పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో (Anantapur district leaders) నిర్వహించిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ..”బాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే” అంటూ వ్యాఖ్యానించారు. మాఫియాలతో నిండిపోయిన పాలనను ప్రజలు సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మాఫియాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా వంటి అనేక అక్రమాలు టీడీపీ పాలనలో చోటుచేసుకున్నాయి. చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు. ప్రజలను మోసగించి, వారి భవిష్యత్తు నాశనం చేస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. నాయకులుగా మనం ప్రజల పోరాటాలకు స్ఫూర్తి కలిగించాల్సిన సమయం ఇది అని జగన్ దిశానిర్దేశం చేశారు.
కూటమి ప్రభుత్వం సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని జగన్ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మ్యానిఫెస్టోను అమలు చేయకుండా, రంగురంగుల కథలకు ‘విజన్ 2047’ అనే పేరు పెడుతున్నారు. ఇది ప్రజల్ని మభ్యపెట్టడమే. దాన్ని విజన్ అనరు.. 420 అంటారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని గుర్తు చేసారు. కోవిడ్ లాంటి సంక్షోభాలు వచ్చినా, ఆదాయాలు తగ్గినా, ఖర్చులు పెరిగినా, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నాం. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ప్రతి పథకాన్ని అమలు చేశాం. ఇది దేశ చరిత్రలోనే అభినవ ఘట్టం. వైసీపీ మాటలకు కట్టుబడి ఉండే పార్టీ” అని జగన్ తెలిపారు. చంద్రబాబు మాటలు కొంతమంది నమ్మినప్పటికీ, ఆరు నెలల్లోనే టీడీపీ అసలు రంగు బయటపడిందని, బాబు చేసిన మోసాలు, అబద్ధాలు ప్రజలకు స్పష్టమయ్యాయి. ఇప్పుడు ప్రజలు టీడీపీపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ జగన్ ఆరోపించారు. మరి జగన్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Read Also : KTR Letter TO Rahul : అదానీపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందా..? అంటూ రాహుల్ కు కేటీఆర్ లేఖ