RRR హెచ్చరికతో వ్యూహం మార్చుకున్న జగన్..!
RRR హెచ్చరికతో వ్యూహం మార్చుకున్న జగన్..!
- By Sudheer Published Date - 03:09 PM, Tue - 4 February 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) వేగంగా మారుతున్న పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) అసెంబ్లీ(Assembly)కి హాజరవ్వాలా వద్దా అన్న అంశంపై అనేక ఊహాగానాలు నెలకొన్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న జగన్, తొలుత అసెంబ్లీకి వెళ్లబోమని ప్రకటించినా, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమవ్వగా, అధికార కూటమి 164 సీట్లు గెలుచుకుంది. ఈ అనూహ్యమైన మార్పు జగన్ను ఆలోచనలో పడేసింది. ప్రధాన ప్రతిపక్ష హోదా తనకు లభించదని ఆయన ప్రకటించినప్పటికీ, అసెంబ్లీకి దూరంగా ఉండటంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ నేతలు, విశ్లేషకులు మాత్రం జగన్ అసెంబ్లీకి రాకుండా ఉండటం, ఓటమి ఒత్తిడే కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.
Jasprit Bumrah: ఇంగ్లాండ్తో తొలి 2 వన్డే మ్యాచ్లకు బుమ్రా దూరం, కారణమిదే?
ఈ నేపథ్యంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (RRR) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరవధికంగా అసెంబ్లీకి హాజరుకాకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. అసెంబ్లీకి హాజరుకాకుంటే తన పదవిని కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో జగన్ తన స్టాండ్ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు అసెంబ్లీలో తన హాజరును ఆశిస్తున్న నేపథ్యంలో జగన్ మళ్ళీ అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచినప్పటికీ, అసెంబ్లీలో అధికార పక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించడం ద్వారా తన దృఢతను ప్రదర్శించాలని జగన్ భావించవచ్చని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో జగన్ హాజరు ఉంటుందా? లేక మరో కొత్త మలుపు తిరుగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలా స్పందిస్తుందన్నది కూడా చూడాలి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభంకానుండటంతో, అప్పటికి ఏ మేరకు రాజకీయ సమీకరణాలు మారతాయో వేచిచూడాల్సిందే.