Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్
రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను, మహిళలను బూట్లతో తన్నించడం, దౌర్జన్యాలు చేయడం అమానుషమని మండిపడ్డారు. నాడు కనీసం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకే రక్షణ లేని పరిస్థితుల్లో, సామాన్య రైతులకు రక్షణ
- Author : Sudheer
Date : 28-03-2026 - 9:19 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక తీర్మానానికి జనసేన పార్టీ తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఏపీ, విభజన తర్వాత రాజధాని లేక కొట్టుమిట్టాడటం అత్యంత శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయని, ఏకాభిప్రాయం లేని బిల్లును రుద్ది రాష్ట్రానికి ఆదాయ వనరులు లేకుండా చేశాయని విమర్శించారు. ఒక భౌగోళిక ప్రాంతం ఉండి కూడా దానికి రాజధాని లేకపోవడం రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయమని, అందుకే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని తాను ఆకాంక్షించానని పవన్ స్పష్టం చేశారు.
సైబరాబాద్ చంద్రబాబు దార్శనికతకు ప్రతీక
హైదరాబాద్ నగరం నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి చంద్రబాబు నాయుడు వేసిన పునాదులే కారణమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. “ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్కు నిలువుటద్దం” అని ఆయన ఉద్ఘాటించారు. ఆయన వేసిన దార్శనికత ఫలితాలను నేటి తరాలు అనుభవిస్తున్నాయని, అదే తరహాలో అమరావతిని కూడా నిర్మించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో వంటి అంతర్జాతీయ సంస్థలు అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వడం శుభపరిణామమని, ఇది కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు వీడి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రజలంతా ‘తెలుగు జాతి’గా ఒక్కతాటిపైకి వచ్చి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వ అరాచకాలు.. రైతుల కన్నీళ్లకు చట్టబద్ధతతో ముగింపు!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు అనుభవించిన కష్టాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను, మహిళలను బూట్లతో తన్నించడం, దౌర్జన్యాలు చేయడం అమానుషమని మండిపడ్డారు. నాడు కనీసం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకే రక్షణ లేని పరిస్థితుల్లో, సామాన్య రైతులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా, ప్రజల రాజధానిగా మారుస్తూ అసెంబ్లీ చేస్తున్న ఈ తీర్మానం.. ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చలేని విధంగా ఒక చట్టబద్ధమైన వాగ్దానమని పవన్ తెలిపారు. రాజకీయాలు నేరమయం కావడాన్ని అంగీకరించబోమని, చట్టసభల్లో ఉండి నేరాలు చేస్తామంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.