Nitish Kumar Reddy: నాన్నమ్మకు బంగారు గాజులు తొడిగిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి
- Author : Vamsi Chowdary Korata
Date : 26-06-2026 - 9:31 IST
Published By : Hashtagu Telugu Desk
టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సొంత ఊరిలో సందడి చేశారు. చాలా ఏళ్ల తర్వాత స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా, గాజువాకలోని తుంగ్లం వెళ్లారు. స్వస్థలానికి వెళ్లిన నితీష్కు కుటుంబ సభ్యులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. నితీష్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఊరికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. తన బాల్యం మొత్తం ఊరిలోనే గడిచిందని, తనకు గ్రామానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నాడు. తాను క్రికెట్లో రాణించడానికి, ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రులు పడిన కష్టం, వారి పాత్రను మర్చిపోలేనన్నాడు. తల్లిదండ్రులు కష్టపడటంతోనే తనకు ఐపీఎల్లో, టీమిండియాలో ఆడే అవకాశం వచ్చిందని అన్నారు. క్రికెట్లోకి విరాట్ కోహ్లీ స్ఫూర్తితో వచ్చానని, టీమిండియా తరపున ఆడటం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు.
సొంత ఊరిలో నాన్నమ్మను నితీష్ కుమార్ రెడ్డి కలిశారు. టీమిండియా తరపున ఆడాలన్న నాన్నమ్మ కలను నెరవేర్చిన నితీష్, ఆమెకు బంగారు గాజులు కానుకగా ఇచ్చారు. నితీష్ స్వయంగా నాన్నమ్మకు బంగారు గాజులు తొడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. నాన్నమ్మ కూడా నితీష్ను చూసి ఎంతో సంతోషించారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు నితీష్తో సరదాగా గడిపారు. నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్కు ఎంపికైన తర్వాత తొలిసారి సొంత ఊరికి వెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తం మీద నితీష్ రాకతో తుంగ్లంలో సందడి వాతావరణం కనిపించింది. నితీష్ గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు దూరమయ్యాడు. నితీష్కు ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతోంది. నాలుగు నుంచి ఐదు వారాల్లో పూర్తిస్థాయిలో కోలుకుంటానని నితీష్ చెబుతున్నాడు.
టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐర్లాండ్, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్కు దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. నితీష్ స్థానంలో సూర్యాన్ష్ షెడ్గెను ఎంపిక చేశారు. అఫ్గాన్తో వన్డే సిరీస్ సమయంలో నితీష్ గాయపడ్డాడు. ముందు చిన్న గాయమని భావించారు, కానీ ఎమ్మారైలో తొడ కండరాలకు గాయమైనట్లు తేలింది. నితీష్ కోలుకునేందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని డాక్టర్లు తేల్చారు. ఆ తర్వాత ఫిట్నెస్ను నిరూపించుకోవడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. ఐర్లాండ్ సిరీస్ నుంచి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా గాయంతో వైదొలిగిన సంగతి తెలిసిందే.