Chintamaneni : చింతమనేని సంచలన కేసు
- Author : CS Rao
Date : 26-05-2022 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, సజ్జల రామక్రిష్ణారెడ్డిపై ప్రైవేటు కేసు పెట్టారు. ఏలూరు కోర్టు ద్వారా ప్రైవేటు కేసు నమోదు చేయడానికి సిద్దం అయ్యారు. ఆ మేరకు కోర్టును చింతమనేని ప్రభాకర్ ఆశ్రయించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే తనై ఏకంగా 25 కేసులు నమోదు చేశారని చింతమనేని ఆవేదన చెందారు. ఆ విషయాన్ని ఏలూరు కోర్టుకు తెలియచేశారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టడం, టీడీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడమే నేరమన్నట్లుగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులు రాహుల్ దేవ్శర్మ, నవజ్యోత్ సింగ్ గ్రేవాల్, కృష్ణారావు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలపై కూడా ఆయన ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఆ మేరకు టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురువారం ఒక ప్రకటన చేశారు. అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తూ ఏలూరు కోర్టులో చింతమనేని ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతం సవాంగ్లపై ప్రైవేట్ కేసు నమోదు చేయాలంటూ కోర్టును కోరడం సంచలనం కలిగిస్తోంది.