CBN : చెత్త రాజకీయాలు చేస్తే..చెత్త పారేసినట్లు పారేస్తా – చంద్రబాబు వార్నింగ్
CBN : అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై "చెత్త పన్ను" విధించడం, చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం చూపడం వంటి అంశాలను ఎత్తి చూపుతూ, తమ ప్రభుత్వం రాగానే ఆ పన్ను రద్దు చేసి, రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యతను తీసుకున్నామని తెలిపారు
- Author : Sudheer
Date : 20-09-2025 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు నాయుడు (CBN) పర్యటన రాజకీయ వాతావరణాన్ని కాసింత వేడెక్కించింది. ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, స్థానిక పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చి ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. నాయకులు కేవలం మాటల్లోనే కాక, పనిలోనూ ప్రజలకు ఆదర్శంగా ఉండాలనే ఆవశ్యకతను ఆయన ఆచరణలో చూపించారు. అనంతరం స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించి, గ్రామీణ పరిశుభ్రతకు కొత్త ఊపు నింపారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 2 కోట్ల చెక్కులను పంపిణీ చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి భరోసా ఇచ్చారు.
Kavitha Vs Harish Rao : ఆ విషయంలో మాత్రమే హరీష్ రావు పై కోపం – కవిత కీలక వ్యాఖ్యలు
ప్రజా వేదిక సభలో పాల్గొన్న చంద్రబాబు, మార్గదర్శి మరియు బంగారు కుటుంబాల సభ్యులతో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై “చెత్త పన్ను” విధించడం, చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం చూపడం వంటి అంశాలను ఎత్తి చూపుతూ, తమ ప్రభుత్వం రాగానే ఆ పన్ను రద్దు చేసి, రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యతను తీసుకున్నామని తెలిపారు. పరిశుభ్రత మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు హితవు పలికారు.
అదేవిధంగా మాచర్లలో గతంలో జరిగిన అల్లర్లు, అరాచకాలను ప్రస్తావిస్తూ, ఇకపై అలాంటి పరిస్థితులు రానీయబోమని, దానికి పాల్పడిన వారందరికీ తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. “మన పరిసరాల్లోని చెత్తతో పాటు చెత్త రాజకీయాలనూ తొలగిస్తాం” అనే వ్యాఖ్యతో కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా మాచర్ల ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపిన చంద్రబాబు, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్తోపాటు పారదర్శక రాజకీయ వ్యవస్థకూ నాంది పలికారు.