Chandrababu : రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి
- By Kavya Krishna Published Date - 12:52 PM, Wed - 21 February 24

ఏపీలో రాజకీయం రాజుకుంటోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రజల్లో పార్టీ బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేతలు ప్రజల్లో తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులపై విమర్శ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరులో వైసీపీ మూక దాడిలో వితంతు మహిళ కంటిచూపు కోల్పోవడం బాధాకరమని ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపోయింది. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తుండగా…వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయింది.
We’re now on WhatsApp. Click to Join.
తెలుగుదేశం నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. భర్త లేకపోయినా… దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా? ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైనా దాడులు నిత్యకృత్యం అయిన మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హంసవేణి కంటి చూపు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి.’ అని ఆయన ఎక్స్లో విమర్శనాస్త్రాలు సంధించారు.
ఇదిలా ఉంటే.. అంతకు ముందు.. ‘భారీ ఓటమి ఖాయమనే ధీమాతో జగన్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టి, పత్రికలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడికి పురిగొల్పుతున్నారు. ఈ హింసాత్మక చర్యలు, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఆఖరి ప్రయత్నం. రాష్ట్రంలో 50 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి’ అని చంద్రబాబు అన్నారు. ఏపీ గవర్నర్, కేంద్ర హోంమంత్రిత్వశాఖకు తాను చేసిన ట్వీట్ను ట్యాగ్ చేశారు చంద్రబాబు.
Read Also : Medaram Jatara : మేడారం జాతర భక్తులకు హెల్త్ అడ్వెజరీ