AP CM : ఒంగోలు అభ్యర్థిగా పురంధరేశ్వరి? మహారాష్ట్ర తరహా గేమ్ కు BJP స్కెచ్!
పురంధరేశ్వరిని సీఎం అభ్యర్థిగా(AP CM)ఫోకస్ చేసే ప్లాన్ ఉందని సమాచారం.
- By CS Rao Published Date - 02:01 PM, Wed - 18 January 23
ఏపీలో అధికారంలోకి రావడానికి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఢిల్లీ బీజేపీ పెద్దలు అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఆ దిశగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దిశానిర్దేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. రాబోవు రోజుల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఉంటే ఆమె ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. ఒక వేళ సంకీర్ణ ప్రభుత్వం వస్తే పురంధరేశ్వరిని సీఎం అభ్యర్థిగా(AP CM) ఫోకస్ చేసే ప్లాన్ తెరవెనుక ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. అందుకే, ఆమెను ఒంగోలు(Ongole) అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈసారి బరిలోకి దించాలని యోచిస్తున్నారట.
పురంధరేశ్వరిని సీఎం అభ్యర్థిగా(AP CM)
ప్రస్తుతం పురంధరేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని 2014 ఎన్నికల్లో ప్రయత్నం చేసినప్పటికీ పొత్తు క్రమంలో చంద్రబాబు అడ్డుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో రాజంపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో గత పదేళ్లుగా చట్టసభలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో కీలకభూమికను పోషిస్తున్నారు. ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా రాజకీయాలపై అయిష్టంగా ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఇక ఆ కుటుంబం నుంచి పురంధరేశ్వరి మాత్రమే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు.
Also Read : CBN-Daggupati : తోడళ్లుల్ల మధ్య జగన్ స్కెచ్! దగ్గుబాటి ఆప్తుడికి పర్చూరు
ఎలాగైనా తెలంగాణ, ఏపీల్లో అధికారంలోకి రావాలని బీజేపీ తాపత్రయపడుతోంది. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కొంత మేరకు విజయం సాధించింది. రాబోవు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని ఢిల్లీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దిశానిర్దేశం చేయడం జరిగింది. అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను కూడా బీజేపీ పెద్దలు ఇచ్చేశారు. ఇక ఏపీ విషయానికొస్తే, పొత్తుల మీద ఆధారపడి ఉంది. ఒక వేళ పొత్తు జనసేన, టీడీపీతో ఉంటే ఈసారి బీజేపీ కొన్ని కీలక స్థానాలను డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆ జాబితాలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఎందుకంటే, గతంలోనూ పలుమార్లు బీజేపీ అభ్యర్థులు అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ బీజేపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు ఉంది. అందుకే, ఈసారి ఒంగోలు నుంచి పురంధరేశ్వరిని(AP CM) పోటీ చేయించాలని భావిస్తున్నారట.
పురంధరేశ్వరిని అసెంబ్లీకి పంపాలని బీజేపీ ఢిల్లీ పెద్దల ఆలోచన (Ongole)
తెలుగుదేశం పార్టీ ఏపీలో బలంగా ఉంది. ఆ పార్టీ బలహీనపడితే, బీజేపీ పుంజుకుంటుందని కమలదళం భావిస్తోంది. అందుకే, వైసీపీతో స్నేహాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. మోడీ, షాకు తెలియకుండా ఒక అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే, బీజేపీ రూట్ మ్యాప్ కోసం చకోరపక్షిలా జనసేనాని పవన్ ఎదురుచూస్తున్నారు. అంటే, ఆయన కూడా బీజేపీని కాదని ఏమీ చేయలేరని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల తరువాత మారే పరిణామాలను దృష్టి ఉంచుకుని ముందుగానే పురంధరేశ్వరిని అసెంబ్లీకి పంపాలని బీజేపీ ఢిల్లీ పెద్దల ఆలోచనగా ఉందని తెలుస్తోంది.
Also Read : CBN-175 : పొత్తు కుతకుత! జనసేనకు చంద్రబాబు స్టేట్ మెంట్ కలవరం!
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రాకపోతే, అప్పుడు గేమ్ ప్లాన్ చేయడానికి ఇప్పటి నుంచే బీజేపీ స్కెచ్ వేసిందట. ప్రీ ఎలక్షన్లో పొత్తుతో వెళ్లినప్పటికీ సంపూర్ణ మోజార్టీ తెలుగుదేశం పార్టీకి రాకపోతే, మహారాష్ట్ర తరహా పాలిటిక్స్ నడిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు గేమ్ ఆడేందుకు పురంధరేశ్వరిని ముందు పెట్టడానికి ఒంగోలు (Ongole) నుంచి పోటీకి దింపాలని యోచిస్తున్నారట. ఎందుకంటే, అక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద వ్యతిరేకత బాగా ఉందని సర్వేల సారాంశం. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతో ఒంగోలు నుంచి తేలిగ్గా బీజేపీ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది. పైగా పురంధరేశ్వరికి టిక్కెట్ ఇస్తానంటే గతంలో మాదిరిగా చంద్రబాబు వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
వైసీపీ పరోక్ష మద్ధతు తీసుకుని ఈసారి బీజేపీ..
ఒక వేళ టీడీపీ, జనసేన కలిసి వెళ్లినప్పటికీ కొన్ని స్థానాల్లో వైసీపీ పరోక్ష మద్ధతు తీసుకుని ఈసారి బీజేపీ కనీసం 5 నుంచి 10 మందికి తగ్గకుండా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపాలని యోచిస్తుందట. ఆ ఎమ్మెల్యేలతోనే మహారాష్ట్ర తరహా గేమ్ ఆడాలని ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నారని టాక్. అందుకే, పురంధరేశ్వరి చరిష్మాను అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నారట. ఆ మేరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దిశానిర్దేశం చేసినట్టు భోగట్టా. ఇలాం టి పరిస్థితుల్లో ఎంపీగా వెళ్లాలనుకుంటోన్న పురంధరేశ్వరి అసెంబ్లీ వైపు చూస్తారా? అనేది వేచిచూడాలి.
Related News
AP Elections 2024: బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..చంద్రబాబు వ్యూహం
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు చంద్రబాబు పార్టీ అభ్యర్దులకు బీఫారాలు ఇస్తున్న సమయంలోనే కొత్త ట్విస్టులు తెర మీదకు వచ్చాయి.