AP Crop Management: జగన్ కిసాన్ డ్రోన్లు, పంటల్లో నెంబర్ 1 ఏపీ
వ్యవసాయం లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ-క్రాప్ అమలు చేసిన జగన్ సర్కార్ అపూర్వ ఫలితాలను సాధించింది.
- Author : CS Rao
Date : 31-08-2022 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
వ్యవసాయం లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ-క్రాప్ అమలు చేసిన జగన్ సర్కార్ అపూర్వ ఫలితాలను సాధించింది. దీన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి ‘వైఎస్ఆర్ యంత్ర సేవ’ కింద కిసాన్ డ్రోన్ల మంజూరుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అయింది. ఈ పథకం కింద అర్హులను రైతు సంఘాలు త్వరగా ఎంపిక చేయాలని ఆదేశించింది.
వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ చేవూరు హరికిరణ్ మాట్లాడుతూ ఆయా పంటలు పండే విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రియల్ టైమ్ పంటల నిర్వహణ ద్వారా సర్వే నంబర్ల వారీగా జరుగుతున్న పంటల గుర్తింపులో ఏపీ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా విజయవంతంగా అమలు చేస్తున్న ఈ-క్రాప్ వల్ల ఇది సాధ్యమైందన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు, మండల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆలోచనలతో తెరపైకి వచ్చిన ఈ-క్రాప్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో అగ్రిస్టాక్ డిజిటల్ అగ్రికల్చర్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ-క్రాప్ అమలులో ఏపీని భాగస్వామిగా చేయడం గర్వించదగ్గ విషయమని, ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు, పంటల బీమా తదితరాలను ఈ-క్రాప్ ప్రమాణాలుగా అమలు చేస్తున్నామని చెప్పారు.
ఇప్పటికే ఈ-క్రాప్ నమోదు చేసుకున్న రైతులందరికీ ఇ-కెవైసి (నో యువర్ క్రాప్) రిజిస్ట్రేషన్ ప్రారంభించాలి. ‘వైఎస్ఆర్ యంత్ర సేవ’ కింద కిసాన్ డ్రోన్ల మంజూరుకు రైతు సంఘాల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం తెలియచేసింది.