Winter Wave: చలి గుప్పిట్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, వణుకుతున్న గిరిజనం
- Author : Balu J
Date : 22-12-2023 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
Winter Wave: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో చలిగాలులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అరకులోయ, చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో చింతపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 7 డిగ్రీలు, అరకులోయ సెంట్రల్ కాఫీ బోర్డులో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొద్దిరోజుల్లోనే ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుముఖం పట్టడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా స్థానిక గిరిజనులు చలి తీవ్రతతో వణుకుతున్నారు.
పాడేరు మండలం మినుములూరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 గంటలకే ఈ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. లంబసింగి, గూడెంకొత్తవీధి ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి చలి గాలులు వీస్తుండడంతో ప్రజలు వెచ్చగా ఉండేందుకు మంటలను వెలిగించి వెచ్చదనం పొందుతున్నారు. ఇక ఏపీలో పలు జిల్లాలో కూడా చలి తీవ్రత పెరిగింది. దీంతో చిరు వ్యాపారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల పొగ మంచు కూడా పేరుకుపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడుతూ రాకపోకలు కొనసాగిస్తున్నారు.
Also Read: Corona Cases: హైదరాబాద్ లో కరోనా కలకలం, ఇద్దరు పిల్లలకు పాజిటివ్