Devaragattu Stick Fight : కర్రల సమరం రక్తసిక్తం.. ఇద్దరి మృతి, 100 మందికి గాయాలు
Devaragattu Stick Fight : దసరా సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరగట్టులో మంగళవారం రాత్రి జరిగిన కర్రల సమరం (బన్నీ ఉత్సవం) రక్తసిక్తమైంది.
- Author : Pasha
Date : 25-10-2023 - 10:52 IST
Published By : Hashtagu Telugu Desk
Devaragattu Stick Fight : దసరా సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరగట్టులో మంగళవారం రాత్రి జరిగిన కర్రల సమరం (బన్నీ ఉత్సవం) రక్తసిక్తమైంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బన్నీ ఉత్సవంలో వందలాది మంది పాల్గొన్నారు. కర్రల సమరంలో భాగంగా ఉత్సవ విగ్రహాలను కాపాడుకునే క్రమంలో దాదాపు 100 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మరణించగా, దాదాపు 7 మంది పరిస్థితి విషమంగా ఉంది. సీరియస్గా ఉన్నవారికి ఆలూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కర్రల సమరం నిర్వహించడాన్ని అడ్డుకునేందుకు గత వారం రోజులుగా పోలీసులు, అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించలేదు. బన్నీ ఉత్సవాలను చూసేందుకు చెట్టుపైకి ఎక్కిన యువకులు ప్రమాదవశాత్తు చెట్టు కొమ్మ విరిగి కిందపడ్డారు. ఈఘటనలో ఒక యువకుడు చనిపోయాడు. మరో నలుగురికి (Devaragattu Stick Fight) గాయాలయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
అసలేం జరిగింది ?
దేవరగట్టుపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు భక్తిభావంతో ఆరాధిస్తారు. ఏటా విజయదశమి రోజున అర్ధరాత్రి స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సులువాయి, ఆలూరు, బిలేహాలు, విరుపాపురం గ్రామాల ప్రజలు మంగళవారం అర్ధరాత్రి టైంలో కర్రలు చేతపట్టి దేవరగట్టుకు చేరుకున్నారు. పెద్దఎత్తున నినాదాలు వేస్తూ కొండపైకి చేరుకున్నారు. కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామికి మల్లమ్మతో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా జైత్రయాత్రకు బయలుదేరారు. గట్టుపై నుంచి కిందకు వచ్చి సింహాసన కట్ట వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సమయంలోనే నెరణికి, కొత్తపేట, నెరణికితండా, బిలేహాల్, ఆలూరు, ఎల్లార్తి, సుళువాయి గ్రామాల ప్రజల మధ్య కర్రల సమరం జరిగింది.