MLC Elections : మూడు ఎమ్మెల్సీ స్థానాలు మనవే – బండి సంజయ్
MLC Elections : ఈ సందర్భంగా ఆయన బీజేపీ పటిష్టంగా నిలబడి మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు
- By Sudheer Published Date - 05:58 PM, Sun - 9 February 25

తెలంగాణ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నల్గొండ జిల్లాలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ పటిష్టంగా నిలబడి మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుంటుందనే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి కమిట్ మెంట్తో పనిచేసే కార్యకర్తలున్నారు కాబట్టి, ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన ప్రకటించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల స్పూర్తితో తెలంగాణలోనూ బీజేపీ విజయాన్ని సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని , బీఆర్ఎస్ నేతలు వివిధ స్కాముల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
Jail Sentiment Break : కేజ్రివాల్ కు జైలు సెంటిమెంట్ వర్క్ కాలేదా..?
బీఆర్ఎస్ అంతర్గతంగా కాంగ్రెస్ గెలుపుకు మద్దతు ఇస్తోందని, ఇలాంటి కుట్రలను బీజేపీ ప్రజల్లో ఎండగట్టాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సరైన అభ్యర్థులు కూడా దొరకడం లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడమే రాష్ట్రంలో విద్యా పరిస్థితి ఎంత అధ్వానంగా మారిపోయిందో చూపిస్తోందని అన్నారు. విద్యా వ్యవస్థను అర్బన్ నక్సల్స్ చేతుల్లో పెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక కులగణన సర్వే పూర్తిగా తప్పుల తడకగా మారిందని బండి సంజయ్ విమర్శించారు. బీసీ జనాభా పెరగాల్సిన పరిస్థితే ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలను తక్కువగా చూపించడం అన్యాయమని తెలిపారు. ప్రభుత్వం నిజమైన గణాంకాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కులను కాపాడే బాధ్యత బీజేపీదేనని స్పష్టం చేశారు.