BJLP Meeting : అసెంబ్లీలో బీజేఎల్పీ భేటీ.. కీలక నిర్ణయాలు, డిమాండ్లు ఇవే
తగిన కార్యాచరణ ప్రణాళికను రెడీ చేసుకొని ఆయా ప్రజా సమస్యలపై గళం విప్పాలని బీజేపీ ప్రజాప్రతినిధులు(BJLP Meeting) డిసైడ్ చేశారు.
- By Pasha Published Date - 02:12 PM, Thu - 12 September 24

BJLP Meeting : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బీజేఎల్పీ సమావేశం జరిగింది. దీనికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఎంపీలు ఈటల రాజేందర్, కొండావిశ్వేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్, నాగేష్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, దన్పాల్ సూర్యనారాయణ, పాల్వయి హరీష్, వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రధానంగా చర్చించారు. వాటిపై పోరాటాలు చేయాలని నిర్ణయించారు. తగిన కార్యాచరణ ప్రణాళికను రెడీ చేసుకొని ఆయా ప్రజా సమస్యలపై గళం విప్పాలని బీజేపీ ప్రజాప్రతినిధులు(BJLP Meeting) డిసైడ్ చేశారు.
Also Read :Malaika Aroras Father : మలైకా అరోరా తండ్రి సూసైడ్.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు
ఈనెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేఎల్పీ మీటింగ్లో డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పెద్దఎత్తున రాష్ట్రస్థాయిలో లేవనెత్తాలని నిర్ణయించారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన 6 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి పెంచాలని తీర్మానించారు. రాష్ట్రంలోని అర్హులైన అన్నదాతలు అందరికీ రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ సర్కారును కోరారు. రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు.
Also Read :Bangladesh Durga Puja: నమాజ్ టైంలో దుర్గాపూజలు చేయొద్దు.. హిందువులకు బంగ్లా సర్కారు ఆర్డర్
అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సరిగ్గా సర్వే చేయించి, బాధిత రైతులు అందరికీ ఆర్థిక సహాయం అందేలా చూడాలన్నారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో ‘హైడ్రా’ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బీజేఎల్పీ కోరింది. పార్టీ మారిన ఎమ్మెల్యే లపై హైకోర్టు ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలని అసెంబ్లీ స్పీకర్ను డిమాండ్ చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ కోసం పోరాటం చేయాలని డిసైడ్ చేశారు.