AMRUT Tenders : కేటీఆర్కు మరో షాక్.. నాంపల్లి స్పెషల్ కోర్టులో వ్యాపారవేత్త సూదిని సృజన్రెడ్డి పిటిషన్
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘అమృత్’ పథకం(AMRUT Tenders)తో ముడిపడిన టెండర్లపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ఈ పిటిషన్ను ఫైల్ చేశారు.
- By Pasha Published Date - 04:07 PM, Sat - 23 November 24

AMRUT Tenders : మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్కు మరో షాక్ తగిలింది. ఆయనపై హైదరాబాద్లోని నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను వ్యాపారవేత్త సూదిని సృజన్రెడ్డి దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘అమృత్-2’ పథకం(AMRUT Tenders)తో ముడిపడిన టెండర్లపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన ఈ పిటిషన్ను ఫైల్ చేశారు. కేటీఆర్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని సూదిని సృజన్రెడ్డి వాదిస్తున్నారు. అమృత్-2కు సంబంధించి పారదర్శకంగానే టెండర్ల కేటాయింపు జరిగిందని ఆయన అంటున్నారు. ఈ విషయంపై తాను గతంలో లీగల్ నోటీసులు ఇచ్చినా కేటీఆర్ తీరు మార్చుకోని కారణంగా ఇప్పుడు క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసినట్లు వ్యాపారవేత్త సృజన్రెడ్డి చెప్పారు.
Also Read :Jharkhand Elections Result : జార్ఖండ్లో జయహో ‘ఇండియా’.. సీఎం సోరెన్ దంపతులు సూపర్ హిట్
‘అమృత్ – 2’ పథకం టెండర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈనెల (నవంబర్) రెండో వారంలో ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. అమృత్ పథకం టెండర్ల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరిందని ఆ కంప్లయింట్లో ప్రస్తావించారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ బంధువు సూదిని సృజన్రెడ్డి నాంపల్లి స్పెషల్ కోర్ట్లో క్రిమినల్ పిటిషన్ వేశారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బంధువు సూదినిపై కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు. తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉందని.. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమృత్’ పథకంలో అక్రమాలు జరిగాయన్నారు. సూదిని సృజన్రెడ్డికి చెందిన సంస్థకు కోట్లు విలువైన టెండర్ను అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. సృజన్రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్కు అర్హతలు లేకపోయినా అమృత్ స్కీంకు సంబంధించిన పనులను అప్పగించారని తెలిపారు.