Srinivas Goud Issue : మంత్రి… మాజీమంత్రి… ఓ పొలిటికల్ డైరెక్టర్
తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ మూమెంట్ బాగా ఉన్న రోజుల్లో సివిల్ సర్వీసెస్ అధికారులను, ప్రజాప్రతినిధులను తమ అదుపులోకి తీసుకోని తమ డిమాండ్లు నేరవేర్చుకోవడం లాంటివి జరిగేవి.
- By Siddartha Kallepelly Published Date - 03:07 PM, Thu - 3 March 22
తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ మూమెంట్ బాగా ఉన్న రోజుల్లో సివిల్ సర్వీసెస్ అధికారులను, ప్రజాప్రతినిధులను తమ అదుపులోకి తీసుకోని తమ డిమాండ్లు నేరవేర్చుకోవడం లాంటివి జరిగేవి. కానీ మంత్రి స్థాయి వ్యక్తిని చంపడానికి సుపారీ తీసుకోవడం, అది తెలంగాణ ఉద్యమంలో చెప్పుకోదగ్గ పాత్రని నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్ పై ఇలా జరగడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కొందరు కుట్ర పన్నినట్టు, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసినట్టు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ఇన్సిడెంట్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఒక మంత్రికి ఎప్పటికి సెక్యురిటి ఉంటుంది, పక్కనే అనుచరులు, అభిమానులు ఉంటారు. అలాంటి వ్యక్తిని వెళ్లి చంపడం సాధ్యమయ్యే పనేనా? అయినా శ్రీనివాస్ గౌడ్ ని చంపాల్సిన అవసరమేముందని, ఇదంతా స్క్రిప్ట్ అని సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.
మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గతవారం ఒక సభలో మాట్లడుతూ తనని చంపడానికి ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక పోలీసులు ఈ విషయం నిజమేనని ప్రకటించడంతో శ్రీనివాస్ గౌడ్ ఆరోపించిన మాజీ మంత్రి, మాజీ ఎంపీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై బీజేపీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఘాటుగా స్పందించారు. మంత్రిని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదని,ఈ కేసు వెనుక రాజకీయ, ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఈసీకి కొందరు యువకులు ఫిర్యాదు చేసారని, అయితే ఆ యువకులే మంత్రి హత్యకు కుట్ర చేసారని కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఇది ఇక బోగస్ కుట్ర అని, దీని వెనుక ప్రశాంత్ కిశోర్ కుట్ర ఉందని డీకే అరుణ ఆరోపించారు. పీకే జిమ్మిక్కులు చెల్లడానికి ఇది బెంగాల్ కాదని, ఆయన కుట్రలు తెలంగాణలో పని చేయవని ఆమె హెచ్చరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని చంపడానికి కుట్ర జరుగుతోందని, ఆయన్ని ప్రభుత్వం కాపాడుకుందని, భవిషత్తులో కూడా కాపాడుతోందని ప్రొజెక్ట్ చేయడం వల్ల కేసీఆర్ కు రెండు లాభాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ది తెలంగాణలో బలమైన సామాజికవర్గం ఈ చర్యతో ఆ సామాజిక వర్గ ప్రజల మద్దతు గులాబీ బాస్ కు ఉంటుంది. ఇక రానున్న ఎన్నికల్లో తమ ప్రత్యర్థి బీజేపీ ఎక్కడైనా ఎదగగలదు అనుకుంటే అది మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అసెంబ్లీ స్థానాలకు పోటి చేస్తే గెలిచే అవకాశముంది కాబట్టి ఇప్పటి నుండే వాళ్ళని అడ్డుకోవడానికి మంత్రి శ్రీనివాస్ వాళ్ళని అనుమానితుల లిస్ట్ లో చేర్చారని, ఇదంతా పీకే డైరెక్షన్ లోనే జరుగుతోందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ ఎప్పుడు వీడనుందో చూడాలి.