MLC Kavitha: మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
- By Balu J Published Date - 04:37 PM, Mon - 22 January 24

MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు విన్నవించిన తెలిసిందే. అయితే ఈ వ్యవహరంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు గా రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ? ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
‘‘భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా ? స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాం’’ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
‘‘ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తాం. భవిష్యత్తులో రాజకీయాల కోసం, సoకుచిత మనస్తత్వంతో, ఈ మహా కార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు, అణగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహా మనిషి! అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నాను’’ అని కవిత అన్నారు.