Congress Leaders Missing : కాంగ్రెస్ నేతలు కనబడుట లేదు
కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలుంటాయని చాలామంది విశ్లేషకులు అంటారు.
- By Siddartha Kallepelly Published Date - 01:59 PM, Tue - 25 January 22
కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలుంటాయని చాలామంది విశ్లేషకులు అంటారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటినుండి ఇది కొంచెం ఎక్కువగా అయినట్టు కనిపిస్తోంది.కాంగ్రెస్ ఏ మీటింగ్ పెట్టిన కొందరు అగ్ర నాయకులు డుమ్మా కొడుతూనే ఉన్నారు. జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.గతంలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా పనిచేసినవారు కూడా పీసీసీ, ఏఐసీసీ కార్యక్రమాలలో ఎక్కడ కనిపించడం లేదు. కనీసం గాంధీ భవన్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన చాలా మంది నేతలు ఇప్పుడు మాత్రం పార్టీకి దూరంగా వుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులకు ప్రత్యేక గుర్తింపు వుంది. కాంగ్రెస్ అధికారంలో వున్న సమయంలో కొండా సురేఖ మంత్రిగా, కొండా మురళి ఎమ్మెల్సీ గా వున్నారు. తెలంగాణ వచ్చాక వాళ్లిద్దరూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్లీ 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రీసెంట్ గా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పటి నుండి పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. కొండా ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ ఇంఛార్జిగా ఉన్నా, పార్టీ మెంబర్ షిప్ కు దూరంగా వుంటున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ దామోదర్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పీసీసీ కార్యవర్గంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా వున్న ఆర్ దామోదర్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు, డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమంలో కూడా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డి సైతం కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎక్కడ కనిపించడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో మంత్రిగా ఉన్నా, తర్వాత పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు, గాంధీ భవన్ కు రావడమే మానేశారు. రేవంత్ పీసీసీ చీఫ్ గా నియామకమయ్యాక ఆయన అడ్రెస్ కూడా కన్పించడం లేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తానే పెద్ద దిక్కు అని చెప్పుకునే నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ కూడా పార్టీలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యే సమయంలో వ్యతిరేక వర్గంతో అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రేమ్ సాగర్ ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలలో కనిపించడమే లేదు. ఆ మధ్య వేసిన కమిటీలు తనకు తెలియకుండా వేశారని, తన అనుచరులకు పదవులు దక్కలేదని ఏకంగా ఏఐసీసీ కే అల్టిమేటం జారీ చేశారు. అవసరమైతే కొత్తపార్టీ పెడతానని హెచ్చరించారు. ఇక అప్పటి నుండి పార్టీకి గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్న డిజిటల్ మెంబర్షిప్ లో మాత్రం అత్యధికంగా సభ్యత్వాలు చేయించారు.
ఇలా అనేకమంది
రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. అసలు వాళ్లు పార్టీలో ఉన్నారా లేరా అనే అనుమానం అటు పార్టీలో, ఇటు కార్యకర్తల్లో ఉంది. మరి ఈ నేతలు పార్టీలో వుంటారా? లేదా ఇతర పార్టీలోకి వెళ్తారా చూడాలి.
Related News
Amit Shah Video Case: అమిత్ షా వీడియో కేసు.. ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకు బెయిల్
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ప్రసారం చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంలోని ఐదుగురు సభ్యులకు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.