Emergency Meeting : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ.. ప్లాన్ అదే
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలస బాటలో ఉండటంతో గులాబీ బాస్ కేసీఆర్ అలర్ట్ అయ్యారు.
- By Pasha Published Date - 01:50 PM, Tue - 25 June 24

Emergency Meeting : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలస బాటలో ఉండటంతో గులాబీ బాస్ కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయిన నేపథ్యంలో పార్టీని రక్షించుకునే పనిని కేసీఆర్ మొదలుపెట్టారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన కాసేపట్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఈ కీలక మీటింగ్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరి పోయారు.
We’re now on WhatsApp. Click to Joinః
ఇవాళ భేటీకి హాజరయ్యేది ఎంతమంది ?
త్వరలో మరింత మంది కూడా కాంగ్రెస్లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీని(Emergency Meeting) ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ వేదికగా బీఆర్ఎస్లోనే ఉండాలని, మంచి గుర్తింపు లభిస్తుందనే భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ పిలుపును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా స్వీకరిస్తారు ? వారి భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.ఇవాళ కేసీఆర్ నిర్వహిస్తున్న అత్యవసర భేటీలో ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు ? ఎంతమంది డుమ్మా కొడతారు ? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ సమావేశానికి గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారనే అంచనాకు రావచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :KCR: కేసీఆర్కు బిగ్ రిలీఫ్.. రైల్ రోకో కేసులో విచారణపై హైకోర్టు స్టే
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై న్యాయపోరాటం కూడా చేయాలని కారు పార్టీ యోచిస్తోంది. ఈవిషయాన్ని తాజాగా సోమవారం రాత్రి తన ట్వీట్లో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ వెల్లడించారు. ఈ అంశంపై న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ చర్చిస్తోందని సమాచారం. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో మూడు నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 27వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై హైకోర్టులో సానుకూల ఆదేశాలు వెలువడకుంటే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది. అయితే దానం నాగేందర్తో పాటు ఇటీవల పార్టీ నుంచి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరి పేర్లతో కలిపి ఒకే పిటిషన్ను సుప్రీంకోర్టులో వేయాలని కేసీఆర్ పార్టీ భావిస్తోంది.