Jai Bhim Inspires: సిద్ధిపేటలో ‘‘జైభీమ్’’ ఘటన.. న్యాయపోరాటానికి దిగిన నిరుపేద నర్సవ్వ!
తన భర్తను లాక్కెళ్లి చిత్రహింసలకు గురిచేయడంతో.. తనకు న్యాయం చేయాలని కోరుతూ తమిళనాడులోని గిరిజన మహిళ చేస్తున్న పోరాట ఆధారంగా 'జై భీమ్' చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 11:49 AM, Tue - 7 December 21
తన భర్తను లాక్కెళ్లి చిత్రహింసలకు గురిచేయడంతో.. తనకు న్యాయం చేయాలని కోరుతూ తమిళనాడులోని గిరిజన మహిళ చేస్తున్న పోరాట ఆధారంగా ‘జై భీమ్’ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అన్యాయానికి గురవుతున్న ఎంతోమందికి ఊపిరిపోస్తోంది. ఉద్యమ పంథాను నేర్పుతోంది. తాజాగా ఓ తెలంగాణ మహిళ తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తోంది. సిద్దిపేటలోని తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సవ్వ న్యాయపోరాటానికి దిగడం చర్చనీయాంశమవుతోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొగుట పోలీస్ స్టేషన్లో తన సోదరుడిని లాక్కెళ్లి చనిపోయిందని ఆరోపిస్తూ న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
అక్షరం ముక్కరాని లక్ష్మీ నర్సవ్వ తన సోదరుడు పాండి యాదగిరి పోలీసు లాకప్లో చనిపోయాడని (2002 నుంచి) ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుతో సహా వివిధ కోర్టులను చుట్టింది. అయితే నర్సవ్వ, ఆమె కుమారుడు నవీన్ ఈ మధ్యే విడుదలై సంచలనం క్రియేట్ చేసిన ‘‘జైభీమ్’’ సినిమాను చూశారు. ఆ సినిమాలో సినతల్లి చూసి ప్రభావితమయ్యారు. ఈ సినిమా మాదిరిగానే అప్పటి కేసును మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్నారు. యాదగిరి కేసు ఫైల్ నంబర్ గురించి ఆరా తీసేందుకు గత వారం సంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు.
ఏం జరిగిందంటే..?
2002 ఏప్రిల్ 4న గ్రామంలో జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి అప్పటి 27 ఏళ్ల యాదగిరిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తొగుట ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు యాదగిరితో పాటు ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే యాదగిరి మినహా మిగిలిన వారందరినీ ఒకటిరెండు రోజుల్లో విడుదల చేశారు. ఏప్రిల్ 6, 7 తేదీల్లో తన సోదరుడి కోసం మధ్యాహ్న భోజనం తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లిన నర్సవ్వ అతడిని చూసేందుకు అనుమతించలేదు. సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీముల్లా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత అనుమతించారు. నర్సవ్వ మాట్లాడుతూ పోలీసులు యాదగిరి నడవడానికి కూడా వీలులేకుండా కొట్టారని ఆరోపించింది.
ఏప్రిల్ 8 న పోలీస్ స్టేషన్ నుంచి యాదగిరి తప్పించుకున్నట్లు అప్పటి ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి నర్సవ్వకు సమాచారం అందించాడు. తప్పిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయమని ఇన్స్పెక్టర్ బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. కానీ నర్సవ్వ నిరాకరించింది. తన సోదరుడిని చూసేందుకు అనుమతించాలని డిమాండ్ చేసింది. గ్రామస్తుల సహకారంతో పోలీస్స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో అప్పటి సిద్దిపేట డీఎస్పీ ప్రకాష్రెడ్డి ఘటనపై ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డితో విచారణకు ఆదేశించారు. విచారణలో యాదగిరి పోలీస్స్టేషన్లోనే చనిపోయాడని, కొండపాక మండలం పెద్దగుట్టలో పాతిపెట్టాడని కానిస్టేబుల్ విచారణ అధికారులకు వెల్లడించాడు.
అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు ఘటన జరిగిన మూడు నెలల తర్వాత మృతదేహాన్ని శ్మశాన వాటిక నుంచి బయటకు తీశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, సబ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా, నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. వారిని విధుల నుంచి సస్పెండ్ చేయడంతో వారిపై ఐపీసీ 306, 201 కింద కేసులు నమోదు చేశారు. అయితే 90 రోజుల విచారణ అనంతరం వాళ్లంతా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం నర్సవ్వ తన పొలంలో సమాధి నిర్మించి, 2002 ఏప్రిల్ 8న యాదగిరిని ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి హత్య చేశాడని, పెద్దగుట్టలో పాతిపెట్టినట్లు రాసి ఉంది.సుదీర్ఘ విచారణల అనంతరం కోర్టులో ఆశించిన ఫలితం రాకపోవడంతో నర్సవ్వ 2005లో సుప్రీంకోర్టు న్యాయవాది చంద్రశేఖరరెడ్డి సహాయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా కోర్టులో సిఐడి చార్జిషీట్ దాఖలు చేసిందని, అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు కేసు కొట్టివేసిందని నర్సవ్వ తెలిపారు.
తాజాగా నర్సవ్వ మీడియాతో మాట్లాడుతూ, కేసు ఉపసంహరణకు నిందితులు భారీ మొత్తంలో డబ్బును ఇచ్చేందుకు ప్రయత్నించారని, అయితే తాను లొంగలేదన్నారు. ” నా చివరి శ్వాస వరకు న్యాయం కోసం పోరాడతాను” అని నర్సవ్వ స్పష్టం చేసింది.
Related News
Revanth Reddy : మామ..అల్లుళ్ల నుండి సిద్దిపేటకు విముక్తి కలిగించాలి
పదేళ్లలో ఢిల్లీ దొర, సిద్దిపేట దొర తెలంగాణ కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. మామ పోతే.. అల్లుడు అన్నట్లుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారని తెలిపారు