Disqualification : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మరోసారి వాయిదా
Disqualification : మంగళవారం జరిగిన విచారణలో బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియగా, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు ఏప్రిల్ 2న వింటామని కోర్టు వెల్లడించింది
- Author : Sudheer
Date : 25-03-2025 - 4:03 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత(Disqualification )పై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి వాయిదా వేసింది. మంగళవారం జరిగిన విచారణలో బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియగా, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు ఏప్రిల్ 2న వింటామని కోర్టు వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ విషయంలో నిర్ణయం ఆలస్యంగా తీసుకున్నారని పిటిషనర్లు కోర్టుకు వాదనలు వినిపించారు. అయితే స్పీకర్ తన విధి నిర్వహణలో ఉన్నారని, నిర్ణయానికి ఏమైనా కారణాలు ఉండొచ్చని అసెంబ్లీ కార్యదర్శి పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలా? లేక రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అనే అంశంపైనా న్యాయస్థానం చర్చించింది.
New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణం ?
ఎమ్మెల్యేల అనర్హతపై వాదనలు మంగళవారం ముగిసినప్పటికీ, ఈ వ్యవహారంపై ఇంకా స్పష్టమైన తీర్పు రాలేదు. తెలంగాణ హైకోర్టు గతంలో స్పీకర్కు నాలుగు వారాల గడువు ఇచ్చినప్పటికీ, అనర్హత పిటిషన్లపై ఇప్పటికీ స్పీకర్ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. బీఆర్ఎస్ తరఫున వాదించిన న్యాయవాది స్పీకర్ నోటీసులు ఇచ్చి మూడు వారాలు దాటినా, ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. మరోవైపు, సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంకా పదవిలో కొనసాగుతుండటంపై ప్రశ్నలు గుప్పించింది. “పార్టీ ఫిరాయింపుల కేసు ఏడాదిగా కొనసాగుతోంది, స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?” అంటూ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.
Bollywood To Tollywood : టాలీవుడ్కు వచ్చేస్తా.. ఎందుకో చెప్పిన సన్నీ దేవల్
ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేశారు. బీజేపీ తరఫున కూడా ఎలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తయిన తర్వాతే తమ పిటిషన్ విచారించాలని బీజేపీ కోర్టును కోరింది. అయితే సుప్రీంకోర్టు ప్రస్తుత విచారణలో స్పీకర్ నిర్ణయంపై మాత్రమే దృష్టి సారిస్తోందని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎటు వెళ్లారనే విషయాలు ఈ విచారణలో భాగం కాదని కోర్టు పేర్కొంది.