సీఎం రేవంత్కు పదవి గండం..బాంబ్ పేల్చిన సీపీఐ నారాయణ
నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రచార విమర్శలేనా లేక కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఏదైనా మార్పు రాబోతోందా అనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని పట్టున్న పొంగులేటి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు
- Author : Sudheer
Date : 09-02-2026 - 12:20 IST
Published By : Hashtagu Telugu Desk
CPI Narayana Key Comments : తెలంగాణ రాజకీయాల్లో సీపీఐ జాతీయ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవీ గండం పొంచి ఉందని, అది స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్లే సంభవించవచ్చని ఆయన బాంబు పేల్చారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారాయణ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కమ్యూనిస్టులను పక్కనపెట్టి కాంగ్రెస్ అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
పొంగులేటిపై నారాయణ ధ్వజమెత్తు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ నారాయణ ఘాటు విమర్శలు చేశారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్.. ఇలా వరుసగా పార్టీలు మారే నాయకులకు ప్రజల్లో విశ్వసనీయత ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. “కమ్యూనిస్టులు తల్లిపాల వంటి వారు, రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారే నేతలు డబ్బా పాల వంటి వారు” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట అని, ఇక్కడ పొత్తులు కుదరనీయకుండా అడ్డుపడింది పొంగులేటి మరియు కాంగ్రెస్ నాయకత్వమేనని ఆయన ఆరోపించారు.
రాజకీయ విశ్లేషణ – పదవి ముప్పు నిజమేనా?
నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రచార విమర్శలేనా లేక కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఏదైనా మార్పు రాబోతోందా అనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని పట్టున్న పొంగులేటి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన రెవెన్యూ వంటి కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. అయితే, ఒక ముఖ్యమంత్రి పదవికి ఒక మంత్రి వల్ల ముప్పు ఉంటుందని బహిరంగంగా వ్యాఖ్యానించడం ద్వారా నారాయణ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను సూచించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ గెలిస్తే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుందా అని ప్రశ్నిస్తూనే, అధికార పార్టీకి ఓటర్లు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.