CM Revanth Visit Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవలో సీఎం రేవంత్ దంపతులు
- Author : Sudheer
Date : 11-03-2024 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో(Yadadri Sri Lakshmi Narasimha Swamy ) నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) ప్రారంభం అయ్యాయి. నేటి నుండి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) దంపతులు పాల్గొన్నారు. ముందుగా శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎం దంపతులు దర్శించుకొని పూజలు నిర్వహించారు.
సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు సీఎం దపంతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.
రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్టకు రావడంతో.. ప్రొటోకాల్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆలయ ఆఫీసర్లు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో సీఎం రేవంత్ భద్రాచలం చేరుకుంటారు. అక్కడ సీతారాములవారిని దర్శించుకొని ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మణుగూరు లో ఏర్పటు చేసిన సభలో పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు విషయానికి వస్తే..తొలి రోజు స్వస్తీ వాచనం, అంకురార్పణ కార్యక్రమం, విశ్వక్సేనారాధన, రక్షా బంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో వేడుకలు పరిపూర్ణం కానున్నాయి. ప్రధాన ఆలయ ఉద్ఘాటన తర్వాత రెండో సారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మాఢ వీధుల్లో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు.
వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు స్వామి వారి నిత్య, మొక్కు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 వేల మంది కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు.
Read Also : Deepfake Video : యూపీ సీఎం యోగి ..డీప్ ఫేక్ వీడియో సంచలనం