CM KCR: తానే సీఎం తానే ప్రతిపక్షం!వారెవ్వా `పీకే`!!
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం గా ఉన్నాడు. ఆయనే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఇదే తరహా స్ట్రాటజీని 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు పోషించాడు.
- By CS Rao Published Date - 01:08 PM, Thu - 24 March 22
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం గా ఉన్నాడు. ఆయనే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఇదే తరహా స్ట్రాటజీని 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు పోషించాడు. ప్రత్యేక హోదా కోసం ధర్మపోరాటం అంటూ ప్రధాని మోడీపై యుద్ధం ప్రకటించి ఘోరంగా పరాజయం పొందాడు. ఇప్పుడు కేసీఆర్ అదే బాటన నడుస్తూ మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆనాడు చంద్రబాబు తరహాలో పరాయజం పొందకుండా సామాజిక, సెంటిమెంట్ అస్త్రాలను తయారు చేసుకుంటున్నాడు.
ప్రస్తుతం ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ పోరాటాలను రచించాడు. డీజిల్ పెంపునకు నిరసనగా గురువారం తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన ప్రదర్శనలకు దిగింది. నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఈ నిరసనల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. రాష్ట్రం మొత్తం హోరెత్తాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రోడ్లపైకి గులాబీ శ్రేణులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పోరాటానికి దిగింది. ఇప్పటికే యాసంగిలో పండే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కేసీఆర్ చేస్తోన్న ప్రధాన డిమాండ్. దీనితో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉద్యమాన్ని రచించాడు.
వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాలను గెలుచుకోవాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ మేరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రోడ్ మ్యాప్ తయారు చేశాడు. ఆయన స్ట్రాటజీల్లో ఎక్కువగా ఓటర్ల భావోద్వేగాలను అనుకూలంగా మలుచుకునేవిగా ఉంటాయి. ఆ తరహా వ్యూహాలను ఏపీ, బెంగాల్ , బీహార్ రాష్ట్రాల్లో చూశాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ పీకే మార్క్ వ్యూహాల ప్రాథమిక సంకేతాలు కనిపిస్తున్నాయి. బీసీ జనాభా గణన అంశాన్ని టీఆర్ఎస్ చీఫ్ తెరమీదకు తీసుకొచ్చాడు. అంతేకాదు, ఎస్టీల రిజర్వేషన్ అంశాన్ని హైలెట్ చేసేలా ముందుకెళుతున్నాడు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సీరియస్ తీసుకున్నాడు.
ప్రస్తుతం రాష్ట్రంలో 4శాతం ముస్లిం, ఎస్టీలకు 6శాతం విద్య, ఉద్యోగాల్లో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తోంది. ఆ రిజర్వేషన్ ను 12శాతం ముస్లిం, 10శాతం ఎస్టీలకు వర్తింప చేయడానికి అనువుగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అంతేకాదు, వెనుబడిన వర్గాల గణన చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. అదే డిమాండ్ ను బీసీ నేతలు ఆర్ కృష్ణయ్యలాంటి వాళ్లు ఉద్యమ రూపంలో తీసుకెళ్డడానికి సిద్ధం అయ్యారు. ఈనెల 29, 30 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా బీసీ గణన కోసం ఉద్యమించాని ఆయన పిలుపు నిచ్చాడు. ఇక ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎప్పటి నుంచో ఆ సామాజిక వర్గం పట్టుబడుతోంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దాన్ని కూడా మరోసారి హైలెట్ చేయడానికి కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు.
హిందూవాదాన్ని ఎలాగూ బీజేపీ ఒక వైపు నుంచి లేపుతోంది. ఫలితంగా ముస్లిం ఓటు బ్యాంకు కేసీఆర్ కు సానుకూలంగా ఉంటుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీల్లో మాదిగ సామాజికవర్గం ఎక్కువ. మాల సామాజికవర్గం ప్రస్తుతం స్వారోల రూపంలో బీఎస్పీ వైపు పనిచేస్తోందని పీకే సర్వే సారంశమట. అందుకే, ఎస్సీ మాదిగలు చాలా కాలంగా డిమాండ్ చేస్తోన్న వర్గీకరణ అస్త్రాన్ని కేసీఆర్ అందుకున్నాడు.
వెనుకబడిన వర్గాల జనాభా గణన చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ, కేంద్రం ఇప్పట్లో బీసీ జనాభా గణన చేపట్టడానికి సిద్ధంగా లేదు. సరిగ్గా, ఇదే పాయింట్ ను కేసీఆర్ అందుకున్నాడు. బీసీలను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మతం, కులం, రిజర్వేషన్ల, ఆంధ్రా సెంటిమెంట్, మోడీ సర్కార్ పై పోరాటం అంశాలను సానుకూలంగా మలుచుకుని మూడోసారి ముచ్చటగా సీఎం కావాలని కేసీఆర్ ఎత్తుగడ.
ఇప్పటికే మోడీ సర్కార్ పై త్రిముఖ వ్యూహంతో కేసీఆర్ పోరాటం ప్రారంభించాడు. క్షేత్రస్థాయిలో కేంద్ర పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజల్ని సిద్ధం చేస్తున్నాడు. ఇంకో వైపు మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపాడు. కేంద్ర మంత్రులతో కలిసి వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని మరోసారి లేవనెత్తడం ద్వారా రాష్ట్ర పరిపాలనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించడానికి కేసీఆర్ వ్యూహాన్ని రచించాడు. మరోవైపు జాతీయ స్థాయి నేతలతో కలిసి మోడీ సర్కార్ ను టార్గెట్ చేయడానికి తెరవెనుక చతురతను ప్రదర్శిస్తున్నాడు.
ఆ క్రమంలోనే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన తికాయత్ లాంటి రైతు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. జాతీయ స్థాయి ఉద్యమానికి ప్రణాళికను రచిస్తున్నాడు. రాజ్యంగపరమైన భద్రత రైతులకు ఉండాలనే అస్త్రాన్ని బయటకు తీశాడు. వ్యవసాయంపై జాతీయ స్థాయి విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నాడు. ఇలాంటి అంశాలతో మోడీకి వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని రైతుల ద్వారా నిర్మించాలని భారీ ఎత్తుగడ వేశాడని తెలుస్తోంది.
రెండుసార్లు సీఎం కావడానికి పనిచేసిన ఆంధ్రా సెంటిమెంట్ ను ఎన్నికల చివరి ఘట్టంలో మరోసారి లేవనెత్తాలని పీకే ఇచ్చిన సలహాగా టీఆర్ఎస్ శ్రేణుల్లోకి టాక్. రిజర్వేషన్లు, బీసీ జనాభా గణన, బీజేపీ హిందూ వాదం తదితరాలను ముప్పేట ప్రయోగించబోతున్నారట. రైతు సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయింది. ఆ మేరకు శ్రేణులను కేసీఆర్ ముందుకు కదుపుతున్నాడు. వీటికి తోడు ఆంధ్రా సెంటిమెంట్ ను చివరి అస్త్రంగా విసరడం ద్వారా అధికారంలోకి రావాలని గులాబీ బాస్ భారీ ప్రణాళికను రచించారని తెలుస్తోంది. ఆ దిశగా భావోద్వేగాలను రేపేలా పీకే వ్యూహాలను రచించాడని వినికిడి.
ఇప్పటికే ఆంధ్రా దుర్మార్గం అంటూ 9, 10 షెడ్యూల్ అంశాలను కేసీఆర్ లేవ నెత్తుతున్నాడు. ఉద్యోగాలు ఇవ్వలేకపోవడానికి ఆంధ్రా నేతల కుట్రలంటూ మొదలు పెట్టాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రయోగించడానికి ఎలాగూ నీళ్ల వివాదం ఇరు రాష్ట్రాల మధ్య ఉంది. ఇలా..పీకీ రచించిన అస్త్రాలను సంధించడం ద్వారా మూడోసారి సీఎం కావాలని కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేశాడని ఆ పార్టీలోని అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ దిశగా అడుగులు వేయడాన్ని కూడా చూస్తున్నాం. సో…పీకే, కేసీఆర్ ద్వయం వేస్తోన్న ఎత్తుగడలను ప్రత్యర్థులు ఎలా తిప్పిగొట్టగలరో..చూడాలి.!
Related News
AP Politics : ప్రశాంత్ కిషోర్ అంచనాలు వైసీపీలో గుబులు పెంచుతున్నాయా..?
2019 ఏపీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంత మేర వైసీపీ గెలుపు కృషి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.