Rave Party at Janwada Farm House : రేవ్ పార్టీనా? రావుల పార్టీనా? – ఎంపీ రఘునందన్
Rave Party at Janwada Farm House : ఈ పార్టీ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరిగిందనే సమాచారం అందుతుంది. ఫాం హౌస్లో ఉన్న వారిని డ్రగ్స్ టెస్టు చేయగా, కొందరికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ గా తేలింది
- By Sudheer Published Date - 12:31 PM, Sun - 27 October 24

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల (KTR’s brother-in-law Raj Pakala) ఫామ్ హౌస్ (Janwada Farm House) లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ మరియు నార్సింగి పోలీసులు ఒక్కరిగా దాడి చేసి పార్టీని భగ్నం చేసారు. ఈ పార్టీ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరిగిందనే సమాచారం అందుతుంది. ఫాం హౌస్లో ఉన్న వారిని డ్రగ్స్ టెస్టు చేయగా, కొందరికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ గా తేలింది. ఈ ఘటనపై పోలీసులు NDPS (Narcotic Drugs and Psychotropic Substances) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పార్టీలో విదేశీ మద్యం కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు, దీని కారణంగా ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ 34 కింద కూడా మరో కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్త విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ రావడంతో.. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఫారిన్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడి నేపథ్యంలో భాగస్వామ్యుల వివరాలు, వారి సంబంధాలు, డ్రగ్ సరఫరా ఎక్కడి నుండి జరిగిందన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన పట్ల బిజెపి , కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ స్పందించగా..తాజాగా గజ్వేల్ పట్టణంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని ప్రకటిస్తుంది. కానీ శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలని విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతుందని ఆరోపించారు. విదేశీ మాదక ద్రవ్యాలతోపాటు, కొకైన్ లు విచ్చలవిడిగా తెచ్చి భాగ్యనగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్ శివార్లలో బాగా ఫేమస్ అయిన ఫాంహౌస్ లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, వీఐపీల పిల్లలు ఉన్నారని అనేక వార్తలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఫాంహౌస్ ఒనర్ తో కుమ్మక్కు కాకపోతే డీజీపీ ఆ ఫాంహౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ను 12 గంటలలో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఫాంహౌస్ లో ఎస్వోటీ పోలీసులు రైడ్ చేసినప్పుడు ఫాంహౌస్ లో, బయట ఉన్న పుటేజ్ లు రిలీజ్ చేయాలని రఘునందన్ రావు అన్నారు. సీఎం జన్వాడ ఫాంహౌస్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రేవంత్ రెడ్డి, కేటీఆర్ లు రాజీ పడ్డారని వార్తలు వస్తున్నాయి. 12గంటలు కల్లా ప్రెస్ మీట్ పెట్టాలి, లేదంటే సీసీ ఫుటేజ్ ఎడిటింగ్ చేస్తారు. రేవంత్ రెడ్డి పొల్యూట్ కాకపోతే జన్వాడ ఫాం హౌస్ లో శనివారం రాత్రి ఏం జరిగింది ప్రజలకు తెలియజేయాలని రఘునందన్ రావు అన్నారు. మళ్లీ మేం పేరు చెబితే మాకు నోటీసులు ఇస్తాడేమో యువరాజు. అందుకే ఆ పార్టీ రాజుదా? యువరాజుదా? రేవ్ పార్టీనా, రావుల పార్టీనా అనేది బయటపడాలి’ అని అన్నారు.
Read Also : Air Pollution: గర్భిణీ స్త్రీలు కాలుష్యమైన గాలిని పీలిస్తే ఏమవుతుందో తెలుసా?