Modi: 13 పార్టీల సంయుక్త ప్రకటనకు గులాబీ బాస్ దూరం
" ముస్లింలను లక్ష్యంగా చేసుకొని కొందరు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నా..
- By Hashtag U Published Date - 01:52 PM, Sun - 17 April 22
” ముస్లింలను లక్ష్యంగా చేసుకొని కొందరు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండటం సరికాదు. మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ప్రధాని విఫలం అయ్యారు” అని దేశంలోని 13 ప్రతిపక్ష పార్టీలు వ్యాఖ్యానించాయి. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఈ 13 పార్టీల జాబితాలో టీఆర్ఎస్ లేదు. బీజేపీ పై రాజీలేని పోరాటం చేస్తానని చెబుతున్న సీఎం కేసీఆర్.. దీనిపై ఎందుకు సంతకం చేయలేదు ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా తన ప్రతి ప్రెస్ మీట్ లో ప్రధాని మోడీపై , బీజేపీ పై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న కేసీఆర్.. ప్రతిపక్షాల సంయుక్త ప్రకటనలో భాగం కాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి ? అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తానంటున్న సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని ఇతర ప్రాంతీయ పార్టీలు శంకించేందుకు ఈ పరిణామం ఊతమిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేయాలనే విజ్ఞప్తి సీఎం కేసీఆర్ కు అందిందా ? అందలేదా ? ఒకవేళ విజ్ఞప్తి అందినా.. సంతకం చేయడానికి సీఎం కేసీఆర్ తిరస్కరించారా ? అనేది తెలియాల్సి ఉంది.
కనీసం దీనిపై సీఎం కేసీఆర్ ప్రజలకు సమంజసమైన వివరణ ఇచ్చుకోగలిగితే కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు సూచిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో.. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తులో ఉన్న శివసేన కూడా ఈ ప్రతిపక్షాల సంయుక్త ప్రకటనలో భాగం కాకపోవడం గమనార్హం. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిగా మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. రోజూ బీజేపీ పై నిప్పులు చెరుగుతున్న శివసేన సంయుక్త ప్రకటనపై సంతకం చేసే సాహసం మాత్రం చేయలేకపోయింది.
సంతకం చేసింది ఎవరు ?
సంయుక్త ప్రకటనపై సంతకం చేసినవారిలో కాం గ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(టీఎంసీ), తమిళనాడు సీఎం స్టాలిన్ (డీఎంకే), జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(జేఎంఎం), ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఫార్వర్డ్ బ్లాక్కు చెందిన దేబబ్రత బిశ్వాస్, ఆర్ఎస్పీకి చెందిన మనోజ్ భట్టాచార్య, ముస్లిం లీగ్కు చెందిన పీకే కున్హాలికుట్టి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్కు చెందిన దీపాంకర్ భట్టాచార్య ఉన్నారు.
Related News
Rajiv Gandhi Death Anniversary : మాజీ ప్రధాని రాజీవ్కు ప్రముఖుల నివాళి.. తండ్రిని గుర్తుచేసుకొని రాహుల్ ఎమోషనల్
ఇవాళ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.