KTR: సైఫైనా, సంజయ్ అయినా వదిలం… మెడికో ప్రీతి ఘటనపై కేటీఆర్ స్పందన!
ఐదు రోజులు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూసిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు.
- By Anshu Published Date - 08:57 PM, Mon - 27 February 23

KTR: ఐదు రోజులు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూసిన కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రీతి ఘటనను కొందరు రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు. కళాశాలలో గొడవలు, ర్యాగింగ్ కారణంగా మనస్థాపానికి గురై, ప్రీతి అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న కేటీఆర్.. అందుకు కారణమైన వాళ్లు ఎవ్వరైనా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
ప్రీతి విషయం తెలిసి మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్పందించారని కేటీఆర్ తెలిపారు. విద్యార్థిని బతికించుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేశామని వివరించారు. దురదృష్టవశాత్తు ప్రీతి మరణించిందన్నారు. అయితే కొందరు ప్రీతి ఘటనపై రాజకీయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిల్లర మల్లర మాటలతో మతం, కులం రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది సైఫ్ అయినా సంజయ్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రీతి కుటుంబానికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కేఎంసీలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ప్రీతి సీనియర్ వేధింపుల వల్ల ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. అయితే పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించిన ప్రీతి.. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడింది. ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని నిమ్స్ వైద్యులు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రీతి మృతిపై తలిదండ్రులు, కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ నేతలు కూడా ప్రీతి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన లవ్ జిహాదీలో భాగమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.