Governor: మా అక్క చనిపోయిందా..? గవర్నర్ పూలదండ ఎందుకు తీసుకొచ్చారంటూ ప్రీతి సోదరి ఆగ్రహం
కేఎంసీలో పీజీ మెడికో ప్రీతి ఘటనపై ఆమె సోదరి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రీతి ఇష్యూలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలని ఆమె సోదరి దీప్తి డిమాండ్ చేశారు.
- By Anshu Published Date - 07:12 PM, Fri - 24 February 23

Governor: కేఎంసీలో పీజీ మెడికో ప్రీతి ఘటనపై ఆమె సోదరి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రీతి ఇష్యూలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలని ఆమె సోదరి దీప్తి డిమాండ్ చేశారు. ప్రీతికి జరుగుతున్న ట్రీట్మెంట్పై అనుమానాలున్నాయన్నారు. ఎస్టీ అమ్మాయి కాబట్టి చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఇష్యూను డైవర్ట్ చేయడానికే ప్రీతిని వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించారని పేర్కొన్నారు.
మరోవైపు ప్రీతి ఘటన తెలియగానే స్పందించిన గవర్నర్ తమిళిసై ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు స్వయంగా ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్ తనతోపాటు పూలదండ తీసుకురావటంపై దీప్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అక్క చనిపోయిందా ఆమె చనిపోయిందని పూల దండ తెచ్చారా గవర్నర్ తమిళిసై పూల దండ ఎందుకు తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ఒక గవర్నర్గా ఈ ఘటనపై ఓ ప్రత్యేక కమిటీ వేయాల్సిందిపోయి.. పూలదండ తీసుకురావటమేంటని ప్రశ్నించారు.
ఇటు ప్రీతి ఆత్మహత్య ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఘటన వెనుకు లవ్ జీహాది ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముమ్మాటికి లవ్ జీహాదీ కేసేనంటూ బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయాలు లేవని ప్రీతిని మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాఠోడ్ చెప్తున్నారు.
ప్రీతి ఆత్మహత్యకు యత్నించడానికి కారణం సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులేనని పోలీసులు నిర్ధారించారు. వాట్సప్ చాట్లో వేధింపులకు సంబంధించిన ఆధారాలు దొరికినట్టు పోలీసు ఉన్నతాధికారి రంగనాథ్ వెల్లడించారు. అయితే ప్రీతి ఎదురుతిరగటం సహిచంలేని సైఫ్.. ప్రీతిని టార్గెట్ చేయటంతో చివరికి ఆత్మహత్యకు యత్నించి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు.