Crime: స్కూటీని అడ్డగించి.. కళ్లలో కారం చల్లి.. రూ.7 లక్షల అపహరణ!!
శాంతినగర్లో దొంగతనం ఘటన వీడియో వైరల్ అవుతోంది.
- By Hashtag U Published Date - 01:55 PM, Sun - 24 April 22
వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీ
శాంతినగర్లో దొంగతనం ఘటన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. శాంతినగర్కు చెందిన కూచన కన్నయ్య వరంగల్ డీమార్ట్ సమీపంలో మహాలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ షాపు నడుపుతున్నాడు. రోజులాగే శనివారం రాత్రి షాపు మూసివేసిన తరువాత బ్యాగులో డబ్బులు పెట్టుకొని స్కూటీపై తన కొడుకు వినయ్తో కలిసి ఇంటికి బయలుదేరాడు. శాంతినగర్ సమీపంలోకి రాగానే ముసుగు ధరించిన ఒక వ్యక్తి..కన్నయ్య స్కూటీని అడ్డగించి కళ్లలో కారం చల్లాడు. స్కూటీ నుంచి వారు కింద పడిపోగానే వినయ్ చేతిలో ఉన్న డబ్బుల బ్యాగును దొంగ లాక్కొన్నాడు. ఆ పక్కనే పల్సర్ బైక్పై మరో ఇద్దరు ఉండగా.. దొంగ డబ్బుల బ్యాగ్తో ఆ బైక్ ఎక్కాడు. అయితే కన్నయ్య, వినయ్ కేకలు వేయడంతో .. ఎదురుగా వస్తున్న ఓ బాటసారి దుండగులను అడ్డగించాడు.
దీంతో దొంగలు బైక్ పైనుంచి కిందపడిపోయారు. బైక్ను అక్కడే వదిలేసి ఆ ముగ్గురు దుండగులు పరారయ్యారు. ఈ ఘటనతో వరంగల్ వాసులు ఉలిక్కిపడ్డారు. దొంగలు ఎత్తుకెళ్లిన బ్యాగులో దాదాపు రూ.7లక్షల నగదు ఉన్నట్లు కన్నయ్య తెలిపారు. ముసుగు ధరించి ఉండటం తో దొంగ ముఖం సరిగ్గా కనిపించలేదని చెప్పారు. తాను రోజూ డబ్బు బ్యాగ్ తో వెళ్తానని తెలిసి, పక్కా పధకం ప్రకారమే ముగ్గురు దుండగులు దాడి చేశారని వాపోయాడు. దొంగల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ను ముమ్మరం చేశాయి. నిందితులు వదిలివెళ్లిన నంబరులేని పల్సర్ ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుడి కొడుకు కూచన వినయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Related News
Hyderabad: హైదరాబాద్లో అమానుషం.. కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం
హైదరాబాద్ లో అమానుషం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిత్తు పేపర్లు ఏరుకుంటూ బ్రతుకు జీవనం సాగిస్తున్న ఓ మహిళపై ఇద్దరు ఆగంతకులు అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు మృతి చెందింది.