Rs 8300 Crore Fraud: రూ.8300 కోట్ల కుంభకోణం.. ఇద్దరు భారత సంతతి అమెరికన్లకు జైలు
వైద్య పెట్టుబడుల రంగం పేరుతో మాయ చేశారు.. వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వచ్చేలా రోగులను ఆకర్షిస్తామన్నారు..
- By Pasha Published Date - 12:24 PM, Tue - 2 July 24
Rs 8300 Crore Fraud: వైద్య పెట్టుబడుల రంగం పేరుతో మాయ చేశారు.. వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వచ్చేలా రోగులను ఆకర్షిస్తామన్నారు.. ఆరోగ్య రంగానికి సంబంధించిన టీవీ ప్రకటనలను ప్రచారం చేస్తామన్నారు.. అక్రమ మార్గాల్లో భారీగా పెట్టుబడులను సేకరించారు.. ‘ఔట్ కమ్ హెల్త్’ (Outcome) పేరిట కంపెనీని ఏర్పాటు చేసి భారత సంతతికి చెందిన అమెరికన్లు రిషీ షా (38), శ్రద్ధ అగర్వాల్(38) రూ.8300 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన అమెరికా కోర్టు.. మనీలాండరింగ్ సహా పలు అభియోగాలలో వీరి పాత్ర ఉందని 2023 ఏప్రిల్లో తేల్చింది. వారిని దోషులుగా నిర్ధారించింది. తాజాగా వారికి శిక్షలను ప్రకటించింది. రిషీ షాకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష, శ్రద్ధ అగర్వాల్కు మూడేళ్ల జైలుశిక్షను అనౌన్స్ చేస్తూ తీర్పును కోర్టు వెలువరించింది. ఇక ఇదే కేసులో ‘ఔట్ కమ్ హెల్త్’ కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) బ్రాడ్ పర్దీని కూడా దోషిగా(Rs 8300 Crore Fraud) నిర్ధారించారు. ఇతడికి కూడా రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఈ ముగ్గురు కూడా కోర్టు ఎదుట తమ నేరాన్ని అంగీకరించారు. తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు పద్ధతులతో పెట్టుబడిదారులను మోసగించినట్లు సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. అందుకే వీరికి విధించే శిక్షలను.. ప్రతివాదులు కోరిన దాని కంటే సగానికి సగం మేర కోర్టు తగ్గించింది.
We’re now on WhatsApp. Click to Join
ఏమిటీ స్కామ్ ?
- 2006లో ‘కాంటెక్ట్స్ మీడియా హెల్త్’ పేరిట ఒక కంపెనీని రిషీ షా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దాని పేరును ‘ఔట్ కమ్ హెల్త్’గా మార్చారు.
- వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను ఆకర్షించేలా ఆరోగ్య రంగానికి సంబంధించిన టీవీ యాడ్స్ను ప్రచారం చేయాలనేది రిషీ షా బిజినెస్ ప్లాన్.
- ఇందుకోసం హాస్పిటళ్లలో టీవీలను ఏర్పాటు చేయాలనేది రిషీ షా ప్రణాళిక.
- రిషీ షా ఆలోచన నచ్చడంతో శ్రద్ధా అగర్వాల్ అనే మహిళ ఈ సంస్థలో సహ భాగస్వామిగా చేరింది.
- 2010 సంవత్సరం నాటికి వైద్య పెట్టుబడుల రంగంలో బడా సంస్థగా ఔట్ కమ్ హెల్త్ ఆవిర్భవించింది.
- దీంతో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు అందులో భారీ పెట్టుబడులు పెట్టాయి. దీంతో షికాగోలో రిషీ షా ఓ దిగ్గజంగా ఎదిగాడు.
- ఆ తర్వాత క్రమంగా వ్యాపారం దెబ్బతినడం మొదలైంది. దీంతో రిషీ షా, శ్రద్ధా అగర్వాల్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రాడ్ పర్దీ కలిసి పెట్టుబడిదారులను మోసం చేయడం మొదలుపెట్టారు. ఈక్రమంలోనే సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితి గురించి దొంగ లెక్కలు రాశారు.
- ఇలా కంపెనీ బలహీనంగా ఉన్న టైంలో కూడా ఫార్మా దిగ్గజ సంస్థ నోవో నోర్డిస్క్ ఏఎస్తో పాటు పలు సంస్థల నుంచి భారీగా పెట్టుబడులను రిషీ షా సమీకరించాడు.
- ఇలా పొందిన డబ్బుతో రిషీ షా విలాసాలు చేసేవాడు. ప్రైవేటు జెట్ విమానాలు, పడవుల్లో విదేశీ టూర్లకు వెళ్లేవాడు. 10 లక్షల డాలర్లతో ఇల్లు కొన్నాడు.
- ‘ఔట్ కమ్ హెల్త్’ కంపెనీ రాసిన తప్పుడు లెక్కలన్నీ వెరసి 2016 నాటికి రిషీ షా నికర ఆస్తుల విలువ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
- 2017లో రిషీ షా మోసాలను మీడియా బయటపెట్టింది. దీంతో అతని పతనం ప్రారంభమైంది.
- తొలుత గోల్డ్ మన్ శాచ్స్, ఆల్ఫాబెట్ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు రిషీ షా, శ్రద్దా అగర్వాల్ పై కోర్టులో కేసులు వేశాయి. 487.5 మిలియన్ డాలర్ల ఫండ్ రైజింగ్ ద్వారా వారిద్దరూ 225 మిలియన్ డాలర్ల డివిడెండ్ పొందారని ఆరోపించాయి. కంపెనీ మాత్రం తీవ్ర నష్టాలలో ఉన్నట్టుగా చూపించారని తెలిపాయి.
- దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం 2023 ఏప్రిల్ లో కోర్టు వీరిని దోషిగా తేల్చింది. ఎట్టకేలకు ఇప్పుడు జైలుశిక్ష కూడా విధించింది.