All Items Price Hike : కొండెక్కిన ధరలు..దసరా చేసుకునేది ఎలా..?
Dasara : జేబులో రూ.500 పెట్టుకొని మార్కెట్కు వెళితే సంచి నిండే సరుకులు కాదు కదా..కనీసం సగం వచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం రూ.3000 ఉంటేగానీ సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
- Author : Sudheer
Date : 07-10-2024 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
కొండెక్కిన ధరలతో ..దసరా (Dasara) పండగను ఎలా చేసుకోవాలో తెలియక సామాన్య ప్రజలు అయోమయమవుతున్నారు. ‘ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదు..’ అని మాట్లాడుకుంటున్నారు. కూరగాయల ధరల దగ్గరి నుండి మార్కెట్ లో లభించే ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి, వెల్లుల్లి ధరలైతే చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవలి వర్షాలకు ఉద్యాన పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతినడం, ఫలితంగా వ్యాపారులు ఇతర రాష్ర్టాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మరో మూడు రోజుల్లో దసరా పండగ రాబోతుంది. ఇప్పటికే బంధువులు ఇంటికి వస్తున్నారు. ఇల్లంతా పిల్లలతో సందడి గా మారింది. పిండివంటలు చేద్దామంటే ఏది చూసిన ధరలు ఆకాశానికి అంటుంతుండడంతో ఏంచేయాలో తెలియక మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. జేబులో ఉన్న డబ్బులతో ఏది రాని పరిస్థితి ఏర్పడింది.
అల్లం పాతది కేజీ రూ.170, టమాట రూ.80, వంకాయ రూ.60, ఎర్రగడ్డ రూ.60, పచ్చిమిరప రూ.80, బీన్స్ రూ.120, పందిరి చిక్కుడు రూ.85, కందగడ్డ రూ.90, క్యారెట్ రూ.60, బెండ రూ.60, చిక్కుడు రూ.60, ముల్లంగి రూ.50, కాకర రూ.60, అలసందలు రూ.70, కాప్సికమ్ రూ.80 ఇలా ఏది కూడా వామ్మో అనేలా పలుకుతున్నాయి. ఈ పెరిగిన ధరలతో సామాన్యజనం అల్లాడిపోతోంది. పల్లెల్లోని దుకాణాల్లోనే వీటి ధరలు రెండింతలుగా ఉన్నాయి. ఇక పప్పుల ధరలు , నూనెల ధరలు అయితే చెప్పాల్సిన పనిలేదు లేదు. వంటల్లో వేసుకునే ఆయిల్ ప్యాకెట్ రూ.130 కి చేరుకోగా..వంటకాల్లో వాడే వంట నూనె రూ.120 కి చేరింది. జేబులో రూ.500 పెట్టుకొని మార్కెట్కు వెళితే సంచి నిండే సరుకులు కాదు కదా..కనీసం సగం వచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం రూ.3000 ఉంటేగానీ సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలీచాలని జీతం తో ఎలా బ్రతుకుడు బండి నెట్టుకురావాలని వాపోతున్నారు. మాకు ఫ్రీ పథకాలు వద్దు కానీ , కాస్త ధరలు తగ్గించండి చాలు అని ప్రభుత్వాలని ప్రజలు వేడుకుంటున్నారు.
Read Also : Mohamed Muizzu : నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్న మాల్దీవుల అధ్యక్షుడు