Metro : మెట్రో రైలు ట్రాక్ కాంక్రీట్ బీమ్ కూలడంతో వ్యక్తి మృతి
Metro : గత నెలలో మెరీనా బీచ్ సమీపంలోని నోచికుప్పం ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనం బాల్కనీ అకస్మాత్తుగా కూలిపోవడం, చెన్నై మెట్రో నిర్మాణం వల్ల ఏర్పడుతున్న ప్రకంపనలు కారణమై ఉంటాయని స్థానికులు అభిప్రాయపడటం
- Author : Sudheer
Date : 13-06-2025 - 3:28 IST
Published By : Hashtagu Telugu Desk
చెన్నై మెట్రో రైలు (Chennai Metro Rail) నిర్మాణ పనుల్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చెన్నై పశ్చిమ ప్రాంతం వలసరవాక్కం సమీపంలో ఉన్న మౌంట్-పూనమల్లి రోడ్ (Mount-Poonamallee Road)పై నిర్మాణంలో ఉన్న భారీ మెట్రో కాంక్రీట్ బీమ్ (Metro concrete beam) ఒక్కసారిగా కూలిపోవడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఐటీ కంపెనీలు, నివాస భవనాలు ఎక్కువగా ఉన్న రద్దీ ప్రాంతంలో చోటు చేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Mercedes-AMG G 63: కేవలం 30 మందికే ఛాన్స్.. ఈ కారు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
సీఎంఆర్ఎల్ ప్రకారం.. లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) నిర్మాణంలో భాగంగా వేసిన రెండు ఐ-గిర్డర్లలో ఒకదానిని పట్టుకోవాల్సిన ఎ-ఫ్రేమ్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. మెట్రో బీమ్లు సాధారణంగా ఎత్తైన ట్రాక్లకు మద్దతుగా ఉంటాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి శిథిలాలను తొలగించేందుకు చర్యలు చేపట్టాయి. మెట్రో ప్రాజెక్ట్లో భాగంగా భద్రతా ప్రమాణాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత నెలలో మెరీనా బీచ్ సమీపంలోని నోచికుప్పం ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనం బాల్కనీ అకస్మాత్తుగా కూలిపోవడం, చెన్నై మెట్రో నిర్మాణం వల్ల ఏర్పడుతున్న ప్రకంపనలు కారణమై ఉంటాయని స్థానికులు అభిప్రాయపడటం.. ఇప్పుడు మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. దుర్ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు చెన్నై మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.