Karnataka: అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మతమార్పిడి నిరోధక చట్టం ముసాయిదా బిల్లు
కర్ణాటకలో మత మార్పిడిలు విపరీతంగా జరుగుతున్నాయని దీనిని నిరోధించడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి అధికార బీజేపీ కసరత్తు చేస్తోంది.
- By Siddartha Kallepelly Published Date - 08:49 AM, Fri - 17 December 21
కర్ణాటకలో మత మార్పిడిలు విపరీతంగా జరుగుతున్నాయని దీనిని నిరోధించడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి అధికార బీజేపీ కసరత్తు చేస్తోంది.
కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ బిల్ 2021 ముసాయిదాలో బలవంతపు మతమార్పిడిలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ముసాయిదాలో పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనర్లు మరియు మహిళలను బలవంతంగా మతమార్పిడి చేస్తే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను వేయాలని ముసాయిదాలో ప్రతిపాదించారు.
కర్నాటకలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అధికార బీజేపీ భావిస్తోంది. ప్రతిపాదిత చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా అనే విషయాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా వరుస సమావేశాలను నిర్వహిస్తోంది.
ప్రస్తుత సెషన్లోనే బిల్లును సభలో ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించింది. ముసాయిదాపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. అయితే తుది బిల్లులో మత మార్పిడికి విధించే శిక్షలపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే శిక్షలపై తుది నిర్ణయాన్ని కేబినెట్ ఫైనలైజ్ చేస్తుందని సమాచారం.
వివిధ రాష్ట్రాల్లో మతమార్పిడిపై ఉన్న చట్టాలను పరిశీలించి, లీగలైజ్ సమస్యలు వచ్చినప్పుడు కోర్టు రెస్పాన్స్ తదితర విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొనే ఈ ముసాయిదా రూపొందించామని బీజేపీ నేతలు చెపుతున్నారు.
డిసెంబర్ 20న జరగనున్న కేబినెట్ భేటీలో ముసాయిదా బిల్లును ఆమోదించి తరువాత వచ్చేవారం శాసనసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ బిల్లును రాజకీయంగా పట్టు సాధించే సాధనంగా భావిస్తున్న బీజేపీ, శాసన మండలిలో ఉమ్మడి ప్రతిపక్షం చేతిలో ఓడిపోయే అవకాశం ఉన్నప్పటికీ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.
బిల్లును ప్రవేశపెట్టాలని, దానిని వ్యతిరేకించాలని నిర్ణయించుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల వైఖరిని బహిర్గతం చేయాలనేదే బీజేపీ ఎత్తుగడ.
సాధారణ వర్గాలకు చెందిన వ్యక్తుల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 25,000 జరిమానా విధించాలని, అదే మైనర్లు, మహిళలు, ఎస్సి, ఎస్టీలకు
చెందిన వ్యక్తులను మతం మార్చాలని చూసేవాళ్ళకి
50,000రూపాయల జరిమానా విధించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం, మత మార్పిడికి ప్రయత్నించే వ్యక్తులు మతమార్పిడి బాధితులకు రూ. ఐదు లక్షల పరిహారం చెల్లించాలని ముసాయిదాలో పేర్కొన్నారు.
అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్, జేడీఎస్ సహా ప్రతిపక్షాలు తేల్చి చెప్పాయి.
ప్రజలు తమకు నచ్చిన మతంలోకి మారడానికి రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంది. బలవంతంగా మతమార్పిడులు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవచ్చు. కానీ మతమార్పిడి నిరోధక చట్టం బీజేపీ మతపరమైన ఎజెండాలో భాగమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభివృద్ధి చూపించి ఓట్లు అడిగే ధైర్యం బీజేపీకి లేదు కాబట్టి వారు మతవాద విషాన్ని ప్రజల మనస్సుల్లోకి ఎక్కిస్తున్నారని, హిందుత్వ ఎజెండాతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
ప్రతిపాదిత చట్టం కర్ణాటకలో విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి తెలిపారు.
ఈ బిల్లు అసెంబ్లీలో చట్టంగా మారినా, మారకపోయినా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీస్తుందని, ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags
Related News
Marathas Reservation : మరాఠాలకు10 శాతం రిజర్వేషన్.. బిల్లుకు కేబినెట్ ఆమోదం
Marathas Reservation : ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.