Rare Operation: సినిమా వల్ల ఎన్ని ప్రయోజనాలు! రోగికి సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేసిన ‘గాంధీ’ డాక్టర్లు
తెలుగులో మొదట్లో పౌరాణిక సినిమాలు తీసేవారు. వాటిల్లో న్యాయం, ధర్మం, నీతి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు.
- By HashtagU Desk Published Date - 05:12 AM, Sun - 28 August 22
తెలుగులో మొదట్లో పౌరాణిక సినిమాలు తీసేవారు. వాటిల్లో న్యాయం, ధర్మం, నీతి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. తరువాత సాంఘిక చిత్రాల ప్రారంభంతో సామాజిక ప్రయోజనం, యువతలో చైతన్యం కలిగించే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తరువాత తరువాత సినిమాలు వ్యాపారాత్మకమైపోయాయి. అయినప్పటికీ తరచూ సామాజిక అంశాలకు ప్రాధాన్యం కలిగిన చిత్రాలు వస్తూనే ఉన్నాయి. సినిమాలకు సామాజిక ప్రయోజనం ఉండాలని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రి డాక్టర్లు సినిమా వల్ల ఓ కొత్త ప్రయోజనం కనిపెట్టారు. ఆ డాక్టర్లు ఓ రోగికి సినిమా చూపిస్తూ మత్తు మందు ఇవ్వకుండా స్పృహలో ఉండగానే ఏకంగా ఓ క్లిష్టమైన ఆపరేషన్ చేసేశారు. అరుదైన ఆపరేషన్ చేసి ఓ రికార్డు సృష్టించారు.
హైదరాబాద్కు చెందిన ఓ మహిళ (50) అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షించి ఆమె మెదడులో కణితి ఉందని గుర్తించారు. ఆమెకు ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించడానికి డాక్టర్లు సిద్ధమయ్యారు. ఒక ట్యాబ్ లో ఆమెకు సినిమా చూపిస్తూ మత్తు మందు ఇవ్వకుండానే ఆమెను స్పృహలో ఉంచే ఆపరేషన్ మొదలుపెట్టారు. అయితే, మధ్యమధ్యలో డాక్టర్లు ఆమెతో సినిమాల విషయాలు మాట్లాడారు. అభిమాన నటుల గురించి డాక్టర్లు ప్రశ్నలు అడుగుతూ ఉంటే, ఆమె సమాధానాలు చెబుతూ ఉన్నారు. రెండు గంటలకు పైగా ఆమె సినిమాలో లీనమైపోయారు. అలా డాక్టర్లు ఆపరేషన్ ముగించేశారు. ఆపరేషన్ జరుగుతున్న విషయమే ఆమెకు తెలియకుండా మెదడులోని కణితిని తొలగించేశారు. ఆపరేషన్ జరుగుతున్న విషయమే ఆమెకు తెలియకుండా వారి పని వారు చేసేశారు. ఆపరేషన్ సక్సెస్. రోగిని స్పృహలో ఉంచే ఎంతో కష్టపడి ఇంతటి ఆపరేషన్ చేయడం గాంధీ ఆస్పత్రి డాక్టర్ల నైపుణ్యానికి నిదర్శనం. ఇలా రోగిని స్పృహలో ఉంచే మెదడుకు సర్జరీ చేసే పద్ధతిని ‘అవేక్ క్రేనియాటోమీ’ అని అంటారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు చెప్పారు. ఈ ఆపరేషన్ చేసినవారిలో న్యూరో సర్జరీ డాక్టర్లు ప్రకాశరావు, ప్రతాప్ కుమార్, నాగరాజులతోపాటు అనస్థీషియా డాక్టర్లు శ్రీదేవి, సారయ్య తదితరులు ఉన్నారు.
Related News
Gandhi Hospital: కరోనా వేరియంట్ JN.1 ఎదుర్కొనేందుకు గాంధీ ఆస్పత్రి సిద్ధం
కరోనా కొత్త వేరియంట్ కేసులతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. కోవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.