Tragic: పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య..ప్యాంట్ పై సూసైడ్ నోట్
Tragic: తాజాగా తమిళనాడులో పోలీసుల దాడులతో సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ మరణించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.
- By Kavya Krishna Published Date - 01:57 PM, Wed - 16 July 25

Tragic: తాజాగా తమిళనాడులో పోలీసుల దాడులతో సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ మరణించిన ఘటన తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లాలోని ఛేడా నాగ్లా ప్రాంతానికి చెందిన దిలీప్ రాజ్పుత్ అనే యువకుడు, పోలీసులు, భార్య కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే… దిలీప్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, భర్త మద్యం తాగి వచ్చి తనపై దాడి చేస్తున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు దిలీప్ను స్టేషన్కు పిలిపించారు. దిలీప్ తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. అక్కడ కానిస్టేబుల్ యశ్వంత్ యాదవ్ రాజీ కోసం రూ.50,000 లంచం డిమాండ్ చేశాడు. దిలీప్ తిరస్కరించడంతో, అతనిపై ఫిజికల్గా దాడి చేశాడు. తర్వాత మరో కానిస్టేబుల్ మహేష్ ఉపాధ్యాయ్ మధ్యవర్తిగా వచ్చి, రూ.40,000 తీసుకుని దిలీప్ను విడిచిపెట్టారు.
BCCI: రోహిత్, విరాట్ రిటైర్మెంట్.. బీసీసీఐ కీలక ప్రకటన!
అయితే ఈ ఘటన దిలీప్ను తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. ఇంటికి చేరుకున్న అతను సూసైడ్ నోట్ రాశాడు. అందులో తనపై భార్య కుటుంబ సభ్యులు వాన్వారీ లాలా, రాజు, రజనేష్ రాజ్పుత్లు పోలీసులతో కలిసి వేధించారని పేర్కొన్నాడు. లంచం డిమాండ్ చేసి, ఆమోదించకపోతే చితక్కొట్టారని వివరించాడు. చివరకు రూ.40,000 ఇచ్చాకే విడుదల చేశారని వాపోయాడు. ఈ విషాదభరితమైన పరిణామాల తర్వాత గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
దిలీప్ మరణంపై అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన జిల్లా పోలీసు అధికారి ఆర్తి సింగ్ మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య కలహాలపై ఫిర్యాదు అందిందని, పోలీసులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని తెలిపారు. దిలీప్ ఇంటికి చేరుకున్నాకే ఆత్మహత్య చేసుకున్నాడని, పోస్టుమార్టం నివేదికలో శరీరంపై గాయాలులేవని స్పష్టం చేశారు. అయితే బాధితుడి కుటుంబం చేసిన ఆరోపణల నేపథ్యంలో, రెండు కానిస్టేబుళ్లతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సంఘటన మరల ఒకసారి పోలీసుల లంచాల వ్యవహారాన్ని, బాధితుల నిరాశకు దారితీసే వ్యవస్థను ప్రశ్నించేలా మారింది. న్యాయం కోసం ఎదురుచూస్తున్న దిలీప్ కుటుంబానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Massive Accident : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డుప్రమాదం.. లోయలో పడిన టాక్సీ, ఎనిమిది మంది మృతి