Lok Sabha Polling : తుది విడత పోలింగ్ షురూ.. బారులు తీరిన ఓటర్లు
సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
- By Pasha Published Date - 07:33 AM, Sat - 1 June 24
Lok Sabha Polling : సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ విడతలో 8 రాష్ట్రాలు, యూటీలలోని 57 లోక్సభ స్థానాల్లో పోలింగ్(Lok Sabha Polling) జరుగుతోంది. మొత్తం 904మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 10.06 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 1.09 లక్షల పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ విడతలో పోటీలో ఉన్న కీలక అభ్యర్థుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, ఆర్.కె.సింగ్, మహేంద్రనాథ్ పాండే, పంకజ్ చౌధరీ, అనుప్రియా పటేల్ సహా పలువురు ఉన్నారు. ఇవాళ పోలింగ్ ఘట్టం ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మీడియా సంస్థలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు వెల్లడించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
- ఏడో విడత ఎన్నికల్లో భాగంగా పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
- పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ 1996 తర్వాత తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తున్నాయి.
- ఉత్తరప్రదేశ్లో 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న 13 స్థానాల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
- ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపుపై ప్రధాని మోడీ గురిపెట్టారు. వరుసగా మూడోసారి గెలవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఇక్కడి నుంచి ప్రధాని మోడీపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ తరఫున అతహర్ జమాల్ లారీ పోటీ చేస్తున్నారు.
- బెంగాల్లో మమతా బెనర్జీకి గట్టి పట్టున్న 9 లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది.
Also Read :Congress Boycott Exit Poll: ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలు.. ఎలా ?
ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఏకంగా రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ఒక అంచనా. ఈ ఖర్చు ఒక రాష్ట్ర బడ్జెట్ తో సమానం. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ప్రకారం.. మన దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు రూ.1.35 లక్షల కోట్లు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, బీఆర్ఎస్ సహా ప్రధాన పార్టీలన్నీ భారీగా డబ్బులు ఖర్చు చేశాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు 60 వేల కోట్లు. అంటే ఈసారి అంతకంటే రెట్టింపు రేంజులో ఎన్నికల కోసం పార్టీలు ఖర్చు పెట్టాయి. 2020 సంవత్సరంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అయిన ఖర్చు రూ.1.2 లక్షల కోట్లు. అంటే అమెరికా కంటే మన దేశంలో ఎన్నికల కోసం 15 వేల కోట్లు ఎక్స్ ట్రా వెచ్చించారు.