Mother Teresa’s Charity: విదేశీ విరాళాలకు కేంద్రం ఆమోదం
- Author : hashtagu
Date : 08-01-2022 - 11:28 IST
Published By : Hashtagu Telugu Desk
మదర్ థెరెసా మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీసీఆర్ఏ) కింద లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. విదేశాల నుంచి విరాళాలను స్వీకరించేందుకు చారిటీకి ఉన్న లైసెన్స్ గడువు ఇటీవల ముగిసిన నేపథ్యంలో
లైసెన్సు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోగా, కొన్ని లోపాలను గుర్తించి పునరుద్ధరణకు కేంద్రం నిరాకరించింది. దీంతో వాటిని సరిదిద్ది, నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనిపై ప్రతిపక్షాలు, పలు ఇతర వర్గాల నుంచి అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్నో కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుందని ఆందోళన వ్యక్తం అయింది.
మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహిస్తున్న చిన్నారుల సంరక్షణ కేంద్రంలో మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నట్టు గుజరాత్ లో ఒక పోలీసు కేసు నమోదు అయిన రెండు వారాల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.