Cracker Explosion : పూరీలో పేలుడు.. ముగ్గురు భక్తుల మృతి.. 30మందికి గాయాలు
ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది.
- By Pasha Published Date - 10:51 AM, Thu - 30 May 24

Cracker Explosion : ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో అపశ్రుతి చోటుచేసుకుంది. కొంతమంది భక్తులు పటాసులు పేలుస్తుండగా నిప్పు రవ్వలు ఎగిసి.. సమీపంలో బాణసంచా నిల్వ ఉంచిన చోట పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించి ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 30మందికిపైగా గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join
పూరీలోని నరేంద్ర పుష్కరిణిలో జగన్నాథుడి చందన ఉత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాది మంది భక్తులు చేరుకున్నారు. ఈసందర్భంగా కొంతమంది భక్తులు పటాసులు పేల్చారు. వాటి నిప్పు రవ్వలు సమీపంలో ఉంచిన బాణసంచా నిల్వలపై పడటంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీని నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొంతమంది ఆలయ పుష్కరిణిలోకి దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల చికిత్సకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ చికిత్సకు అయ్యే ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందిస్తామన్నారు.
Also Read :Courier Cheating : ‘కొరియర్’ పేరుతో కొల్లగొడతారు.. జాగ్రత్త సుమా !
జగన్నాథ యాత్ర రథాల తయారీ ఇలా..
పూరీలో కొలువై ఉన్న భగవాన్ జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల రథాల తయారీ కోసం వేప, హంసి చెట్ల చెక్కను వినియోగిస్తారు. ఈ కలపను సేకరించేందుకు అవసరమైన చెట్లను జగన్నాథ దేవాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుంది. ఆరోగ్యకరమైన, పవిత్రమైన వేప చెట్లను ఈ కమిటీ గుర్తిస్తుంది. ఈ రథాల తయారీలో గోళ్లు, మేకులు, ఇతరత్రా లోహాలను వాడరు. ప్రతి సంవత్సరం రథయాత్ర కోసం కొన్ని కుటుంబాల సభ్యులు మాత్రమే రథాలను తయారు చేస్తారు. ఈ పని కోసం ఆధునిక యంత్రాలను అస్సలు వాడరు. తమ పూర్వీకుల నుంచి లభించిన జ్ఞానం ఆధారంగానే రథాలను తయారు చేస్తారు.