BJP Formation Day : బీజేపీ ఆవిర్భాదినోత్సవ వేడుకల ప్రణాళిక
- By CS Rao Published Date - 03:31 PM, Tue - 5 April 22

ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను బూత్ వారీగా చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఆ మేరకు ఢిల్లీలో జరిగిన బీజేపీ అగ్రనేతల సమావేశం తీర్మానించింది. ఆ రోజు బూత్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాని మోడీ ప్రసంగాన్ని వినిపించాలని దేశ వ్యాప్తంగా ఉన్న క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత మాత్రమే స్థానికంగా ఉండే లీడర్ల ప్రసంగాలు ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 20 వరకు వివిధ కార్యక్రమాలను బీజేపీ దేశ వ్యాప్తంగా నిర్వహించనుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బూత్ స్థాయిలో ప్రధానమంత్రి ప్రసంగం తర్వాత పార్టీ చరిత్ర, పోరాటంపై మాట్లాడేందుకు ఆయా బూత్ స్థాయిలోని సీనియర్ పార్టీ నేత ప్రసంగించే అవకాశం ఉంది. రూట్ మ్యాప్ ను ఖారారు చేసిన సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సీటీ రవి, కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నెల రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాల ప్రణాళికపై చర్చించారు. పార్టీలోని పలు రాష్ట్ర యూనిట్లు ప్రధాని ప్రసంగానికి సన్నాహాలు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి ప్రసంగానికి ప్రజలు హాజరు కావడానికి, ప్రభుత్వం పథకాల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రతి పోలింగ్ బూత్ వద్ద LED స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. ఈ దినోత్సవాన్ని ప్రతి రాష్ట్రంలో జరుపుకోవాలని పార్టీ యోచిస్తోంది. ఏప్రిల్ 14న బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ జయంతిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. దీంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేయనున్నారు.