11 Crore Donations : అయోధ్యకు 10 రోజుల్లో 11 కోట్ల విరాళం.. దర్శించుకున్న 25 లక్షల మంది
11 Crore Donations : జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అయోధ్యలోని రామమందిరాన్ని 25 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.
- By Pasha Published Date - 12:09 PM, Fri - 2 February 24

11 Crore Donations : జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అయోధ్యలోని రామమందిరాన్ని 25 లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తులు గత పది రోజుల వ్యవధిలో ఆలయానికి ఇచ్చిన విరాళాలు ఎన్నో తెలుసా ? రూ.11 కోట్లు !! శ్రీరాముడికి కానుకగా రూ.8 కోట్లను విరాళాల పెట్టెల్లో భక్తులు వేయగా.. రూ.3.5 కోట్లను ఆన్లైన్ చెల్లింపుల ద్వారా ఆలయానికి విరాళంగా అందించారు. ఈవివరాలను అయోధ్య రామమందిర ట్రస్ట్ కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
హుండీలు, ఆన్లైన్ చెల్లింపు కౌంటర్ల వివరాలివీ..
రామమందిరానికి వెళ్లే భక్తులు కానుకలు జమ చేయడానికి నాలుగు విరాళాల పెట్టెలను ఏర్పాటు చేశారు.గర్భగుడిలోని అయోధ్య రామయ్యకు పూజలు చేయడానికి భక్తులు నడుచుకుంటూ వెళ్లే ‘దర్శన మార్గం’ వెంట ఈ హుండీలను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా డిజిటల్ రూపంలో విరాళాలను చెల్లించేందుకు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లను ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో రామ భక్తులు చెక్కులు, ఇతర ఆన్లైన్ చెల్లింపు పద్ధతుల ద్వారా తమ విరాళాలను సమర్పించవచ్చు. రోజూ సాయంత్రం కౌంటర్ మూసివేయగానే 11 మంది బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఆలయ ట్రస్టు సిబ్బంది సహా మొత్తం 14 మంది కలిసి విరాళాల పెట్టెల్లో(11 Crore Donations) జమ చేసిన కానుకలను లెక్కిస్తారు. విరాళాల లెక్కింపు ప్రక్రియ సీసీటీవీ నిఘాలో జరుగుతుంది.
Also Read : Grand Jumbo Tulabhara : 5,555 కిలోల రూ.10 నాణేలతో తులాభారం.. నాణేల విలువ రూ.75 లక్షలు
భారీసంఖ్యలో వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయోధ్యలోని బాలక్ రామ్ మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతకుముందు ఆలయ దర్శన వేళలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఉండేవి. ఇక దర్భంగా, అహ్మదాబాద్, చెన్నై, జైపూర్, పాట్నా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి అయోధ్యను కనెక్ట్ చేసే విమాన సర్వీసులను కూడా స్పైస్జెట్ ఎయిర్లైన్స్ ప్రారంభించింది. దీంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన 8 నగరాలను అయోధ్యతో కలుపుతూ ప్రత్యేక స్పైస్జెట్ డైరెక్ట్ ఫ్లైట్ సేవలను ప్రారంభించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. గురువారం జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు ఆ రాష్ట్ర మంత్రి వీకే సింగ్ పాల్గొన్నారు.