Maoists Encounter : నలుగురు మావోయిస్టు అగ్రనేతల ఎన్కౌంటర్
Maoists Encounter : నలుగురు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు.
- Author : Pasha
Date : 19-03-2024 - 10:47 IST
Published By : Hashtagu Telugu Desk
Maoists Encounter : నలుగురు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు. మహారాష్ట్రలోని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న గడ్చిరోలిలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారు. వీరిని మావోయిస్టు పార్టీ దళ కార్యదర్శులు వర్గీశ్, మగ్తూ, పార్టీ సభ్యులు కుర్సుంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్గా(Maoists Encounter) గుర్తించారు. చనిపోయిన మావోయిస్టులలో ఒకరిపై రూ.36 లక్షల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ బార్డర్స్ నుంచి ప్రాణహిత నదిని దాటుకొని కొంతమంది మావోయిస్టులు గడ్చిరోలి అడవుల్లోకి ప్రవేశించినట్టు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో పలుచోట్ల దాడులకు మావోయిస్టులు వ్యూహరచన చేశారని, అందుకే తెలంగాణ నుంచి గడ్చిరోలిలోకి ప్రవేశించారని జిల్లా ఎస్పీ నీలోత్పల్ వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
గడ్చిరోలి పోలీస్ సీ-60, సీఆర్పీఎఫ్ యూనిట్లు సంయుక్తంగా రేపన్పల్లి సమీపంలోని కోలమర్క పర్వతాలలో మంగళవారం ఉదయం కూంబింగ్ నిర్వహించాయి. ఈక్రమంలో నక్సలైట్లు భద్రతా బలగాలపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రతికాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ పూర్తయ్యాక పరిశీలించగా.. అడవుల్లో నలుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలిలో ఒక ఏకే-47 రైఫిల్, ఒక కార్బైన్, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులు పోలీసులకు లభ్యమయ్యాయి.