Kartika Vana Bhojanalu: వన భోజనాలు అంటే ఏమిటి? కార్తీక మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు?
వనభోజనాల ప్రత్యేకత ఏమిటి? కార్తీక మాసంలోనే వీటిని నిర్వహించే కారణాలు ఏమిటి?
- Author : Kode Mohan Sai
Date : 02-11-2024 - 3:43 IST
Published By : Hashtagu Telugu Desk
కార్తీకమాసం వచ్చిందంటే, తెలుగు రాష్ట్రాల్లో వన భోజనాల ఉత్సవం మొదలవుతుంది. కానీ, కార్తీక మాసంలో వన భోజనాలకు ఎందుకు వెళ్ళాలి, దాని ప్రత్యేకత ఏమిటి అనేది చాలామందికి తెలియదు. కార్తీకమాసం వనభోజనాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. దీనిని మనం ఒకసారి పరిశీలిద్దాం.
వనము అనేది అనేక వృక్షాల సముదాయం. ఇందులో రావి, మర్రి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస వంటి వృక్షాలతో పాటు, తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ వంటి మొక్కలు మరియు వివిధ రకాల పూల మొక్కలు ఉండాలి. దాహం వేస్తే, దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు కూడా అవసరం. ఈ విధంగా వనము సకల ప్రకృతిని ఉత్పత్తి చేస్తుంది.
ఈ ప్రదేశాలలో జింకలు, కుందేళ్లు, నెమళ్లు, చిలుకలు వంటి సాదు ప్రాణులు నివసిస్తాయి. అందువల్ల, ఈ ప్రాంతాన్ని వనము అని పిలుస్తారు. వనము అంటే నివసించడానికి అనువైన ప్రదేశం, వేటకు, క్రూరత్వానికి తావులేనిది. ఈ వనాన్ని దేవతా స్వరూపంగా కూడా భావిస్తారు. వృక్షాలు మరియు మొక్కలు దేవతలు మరియు మహర్షుల ప్రతిరూపాలు. అలాంటి వనాలను ఏడాదికి ఒక్కసారైనా దర్శించాలని మన పూర్వీకులు సూచించేవారు, దీని వెనుక ఆధ్యాత్మిక మరియు ఆరోగ్యకరమైన కారణాలు ఉన్నాయి.
కార్తీకమాసం నాటికి, వానలు ముగిసి, వెన్నెల రాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది, మనసుకు ఆనందం మరియు ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ ప్రత్యేక మాసం. ఈ కార్తీకమాసం ఆధ్యాత్మికంగా శివ, కేశవులకు ప్రీతికరమైనది. అందుకే శివ మరియు కేశవ భక్తులు ఒకచోట చేరి ఐకమత్యంతో, ఆనందంగా గడపడానికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. మరియు పైన పేర్కొన్న వృక్షాలు, మొక్కలు, చెట్లు పచ్చగా చిగుర్చి, పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో విహరింపజేస్తాయి. అందుకే, కార్తీకమాసంలో వనభోజనాలకు వెళ్లాలని పూర్వీకులు సూచించారు.
అయితే, ఇంత పుణ్యప్రదమైన కార్తీకమాసంలో వనవిహారం చేయాలని అనుకున్నప్పుడు, చాలామంది వెళ్ళడానికి ఇష్టపడరు. ఆకలికి ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఎవరు వెళ్ళరు, అందుకే మన పెద్దలు వనభోజనాలను ఏర్పాటుచేశారు. వనభోజనం అంటే కేవలం తిని తిరగడం మాత్రమే కాదు, దానికి ప్రత్యేక పద్ధతి మరియు నియమాలు ఉన్నాయి.
సూర్యోదయానికి ముందే వనానికి చేరుకోవాలి. అక్కడ ఓ వృక్షం కింద దేవతా విగ్రహాలను ఉంచి పూలదండలతో అలంకరించాలి. అనంతరం, సామూహికంగా తయారు చేసిన శాకాహార వంటను పూజా స్థలానికి చేర్చి, అందరూ కలిసి దేవతారాధన చేయాలి. ఆ ప్రసాదాన్ని వడ్డించుకొని తినడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత, ఆటపాటలకు కూడా సమయం ఇవ్వాలి. ఈ విధంగా బంధాలు బలపడుతాయని పెద్దలు చెప్పడం వలన, ఈ వనభోజనం మనందరికీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది.