Saturday Puja: ఇంట్లో సమస్యలతో సమతమవుతున్నారా.. అయితే శనివారం రోజు ఇలా చేయాల్సిందే!
శనివారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో జరుగుతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చును చెబుతున్నారు.
- Author : Anshu
Date : 02-12-2024 - 10:02 IST
Published By : Hashtagu Telugu Desk
హిందూమతంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అలా శనివారం రోజు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శనీశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడుని కర్మ ఫలదాత అని అంటారు. అంటే మంచి పనులు చేసే వారిని శనీశ్వరుడు ఆశీర్వదిస్తాడు. చెడు పనులు చేసే వారిపై శనీశ్వరుడు ఆగ్రహాన్ని చూపిస్తాడు. అంతేకాదు ఎవరి జాతకంలోనైనా ఏలి నాటి శని, శని దోషం వంటివి ఉంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మరి దోషాలన్నీ తొలగిపోవాలంటే కొన్ని రకాల పరిహారాలు పాటించాలని చెబుతున్నారు.
ముఖ్యంగా శనివారం రోజు ఆ పరిహారాలను పాటిస్తే తొందరగా ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. మరి శనివారం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. శనివారం రోజున సూర్యోదయానికి ముందు రావి చెట్టును పూజించి, నీరు సమర్పించి, ఆవనూనె దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలట. ఈ నివారణ చర్యల ద్వారా శనీశ్వరుడు ఆశీర్వాదంతో సుఖ శాంతులతో జీవించవచ్చని చెబుతున్నారు. ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటే శనివారం రోజు శనగపిండి గోధుమ పిండిని కలిపి ఆ పిండితో చేసిన రోటీని ఆవుకి పెట్టాలట. అలాగే ఆ పిండితో చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలట. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వివాదాలు, గొడవలు తొలగిపోతాయని నమ్మకం.
శనివారం రోజున శనీశ్వరుడి ముందు వెలిగించే దీపం ఆవాల నూనె, కొన్ని లవంగాలు వేసి వెలిగించాలట. ఇలా చేయడం వల్ల శనీశ్వరుడు సంతోషిస్తాడట. దీనివల్ల వ్యక్తి ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుందని చెబుతున్నారు. నల్ల కుక్క ను శనీశ్వరుడి వాహనంగా భావిస్తారు కాబట్టి, శనివారం రోజు నల్ల కుక్కకు ఆహారాన్ని తినిపించడం వల్ల శనీశ్వరుడు సంతోషించి శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చట. రుణ సమస్యలు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.