Bhadrachalam: సీతారామచంద్రస్వామి ఆలయంలో నవమి ఉత్సవాలు!
పాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.
- By Balu J Published Date - 01:22 PM, Fri - 18 March 22

పాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకొని నేటి నుంచి ప్రదాయబద్ధంగా ఆలయ అధికారులు నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి పసుపు దంచే వేడుకను వైభవంగా చేపట్టారు. అలా తయారు చేసిన పసుపుతో తలంబ్రాలను సిద్ధం చేశారు.
ఆలయంలోని బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహించారు. ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్త బృందాలు విశేష సంఖ్యలో తరలివచ్చి గోటి తలంబ్రాలను అందించి మొక్కులు తీర్చుకున్నారు.