Vijayawada Temple:అన్నపూర్ణ దేవిగా అమ్మవారు.. ఈరోజు దర్శించుకుంటే ఫలితం ఇదే..?
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
- Author : Hashtag U
Date : 29-09-2022 - 12:03 IST
Published By : Hashtagu Telugu Desk
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. అసలు అన్నపూర్ణాదేవిని కొలిస్తే ఎప్పుడు ఆహారానికి ఇబ్బంది ఉండదని అమ్మను కొలిచిన వారి గృహం సౌభాగ్యంతో వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం.
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణా దేవిగా భక్తులకు దర్శనమిస్తారు.శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవి అలంకారాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టుకుని ప్రజల ఆకలి దప్పులను తీర్చే తల్లిగా అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతుంది.
ఈరోజు శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవారికి గంధపు రంగు లేదా పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. దద్దోజనం, క్షీరాన్నం, అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.