Yuganiki Okkadu: యుగానికి ఒక్కడు సినిమా రీ రిలీజ్.. సీక్వెల్లో హీరోగా తమిళ్ హీరో.. ఎవరంటే?
దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ యుగానికి ఒక్కడు సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా త్వరలో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.
- By Anshu Published Date - 12:00 PM, Sun - 23 February 25

కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా నటించిన చిత్రం యుగానికి ఒక్కడు. ఆండ్రియా రీమాసేన్ ఇద్దరు ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అసలు సినిమా ఆయిరత్తిల్ ఒరువన్ కాగా యుగానికి ఒక్కడు పేరుతో తెలుగులోకి విడుదల అయింది. దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను ఒక విజువల్ వండర్ గా తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా అప్పట్లో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కూడా కలిగించింది.
తమిళం తో పాటు తెలుగులో కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. హీరో కార్తీ కి ఈ సినిమా మంచి పాపులారిటీని గుర్తింపును కూడా తెచ్చి పెట్టింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రీరిలీజ్ కానున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 15 ఏళ్ల తర్వాత చోలాస్ మళ్లీ తిరిగి వస్తున్నారని వారు ఒక పోస్టర్ విడుదల చేశారు. ఎపిక్ ఫాంటసీ మాస్టర్ పీస్ చూసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానుందని ప్రకటించారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్ వర్షన్ సన్నెక్ట్స్ లో అందుబాటులో ఉంది. యుగానికి ఒక్కడు సినిమాకు సీక్వెల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు సెల్వ రాఘవన్ అధికారికంగా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ధనుష్ హీరోగా నటించనున్నాడని కూడా ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పై ధనుష్ కూడా స్పందించారు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆలస్యమైనా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్లో యుగానికి ఒక్కడు కోసం రూ. 18 కోట్లు బడ్జెట్ అయింది. సీక్వెల్ కోసం సుమారు రూ. 150 కోట్లు దాటొచ్చని అంచనా ఉంది.